Govinda Raju | భక్తుల నీరాజనాలు

Govinda Raju | భక్తుల నీరాజనాలు
Govinda Raju | ఏటూరు నాగారం, ఆంధ్రప్రభ : మేడారం మహా జాతరలో అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. వనదేవతల కొలువుకు తోడుగా వెళ్లేందుకు ఏటూరు నాగారం మండలం కొండాయి నుండి గోవిందరాజు బుధవారం మేడారానికి పయనమయ్యారు. వడ్డేలు, పూజారుల ఆధ్వర్యంలో ఆదివాసీ సంప్రదాయ పద్ధతిలో ఈ యాత్ర ప్రారంభమైంది.
పూజల అనంతరం పయనం :

ముందుగా మల్యాలలోని సమ్మక్క ఆలయంలో పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మల్లెల వంశస్తుల ఇంటి వద్దకు చేరుకుని, అక్కడ శాస్త్రోక్తంగా పూజలు పూర్తి చేసిన తర్వాత పవిత్రమైన గోవిందరాజు పడిగెను ధరించి కాలినడకన మేడారం వైపు బయలుదేరారు. ఈ యాత్ర కొండాయి నుండి ఊరట్టం మీదుగా మేడారం గద్దెల వైపు సాగనుంది.

ఘన స్వాగతం :

గోవిందరాజు పయనమైన మార్గమధ్యంలో భక్తులు భారీగా తరలివచ్చారు. ముఖ్యంగా మహిళలు తమ ఇళ్ల ముందు నీళ్లు ఆరబోసి (పాద ప్రక్షాళన చేసి), కొబ్బరికాయలు కొట్టి వనదేవతల ప్రతిరూపానికి ఘనంగా స్వాగతం పలికారు. డప్పు వాయిద్యాలు, భక్తుల శివసత్తుల పూనకాలతో అటవీ మార్గం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. గోవిందరాజు ఆగమనంతో మేడారంలో జాతర సందడి మరింత పెరిగింది.
