AP | బోరుగడ్డ అనిల్ సంచలన ఆరోపణలు…

మాజీ సీఎం ఇంటి వద్ద హైడ్రామా…!
సజ్జలపై తీవ్ర ఆరోపణలు..


AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం వద్ద బోరుగడ్డ అనిల్ కుమార్ నిరసన చేపట్టారు. గతంలో తాను వైసీపీ నేతగా ప్రచారం చేసుకున్న అనిల్‌కు తమ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని వైసీపీ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తాజాగా జగన్ నివాసం వద్దకు వచ్చిన ఆయన.. తనను అడ్డుకుంటున్నారంటూ ఆరోపించారు.

వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై బోరుగడ్డ అనిల్ తీవ్ర విమర్శలు చేశారు. తనను జగన్ ఇంటికి వెళ్లకుండా సజ్జల తన అనుచరులతో అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తనపై రౌడీ షీటర్ అనే ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. తనపై ఎలాంటి రౌడీ షీట్ లేదని హైకోర్టు స్పష్టం చేసిందని అనిల్ తెలిపారు. తనను రౌడీ షీటర్‌గా చిత్రీకరించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో 12 మంది పోలీసులకు కోర్టు మెమోలు ఇచ్చిందని పేర్కొన్నారు. వైఎస్సార్ సమాధి వద్దకు వెళ్లి జగన్‌ను ముఖ్యమంత్రిని చేస్తానని ప్రమాణం చేశానని వ్యాఖ్యానించారు.