నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు..

  • 210 పాయింట్లు పడిన సెన్సెక్స్‌
  • నాలుగు రోజుల లాభాలకు బ్రేక్..
  • కొత్త క్లోజింగ్ విధానంతో పెరిగిన ఒడిదుడుకులు

ముంబై, ఆంధ్రప్రభ : దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. వరుసగా నాలుగు రోజులుగా కొనసాగిన లాభాల పరంపరకు బ్రేక్‌ పడింది. ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ (ఎఫ్‌అండ్‌ఓ) గడువు ముగింపు రోజు కొత్త క్లోజింగ్‌ వేలం (క్లోజింగ్‌ ఆక్షన్‌) విధానం అమల్లోకి రావడంతో మార్కెట్‌లో తీవ్ర ఒడిదుడుకులు కనిపించాయి.

ట్రేడింగ్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 210 పాయింట్లు కోల్పోయి 78,429 వద్ద, నిఫ్టీ-50 159 పాయింట్లు పడిపోయి 24,615 వద్ద ముగిసింది. విస్తృత మార్కెట్లలో మిశ్రమ ధోరణి కనిపించింది. నిఫ్టీ మిడ్‌క్యాప్‌-100 నష్టాల్లో ముగియగా, నిఫ్టీ స్మాల్‌క్యాప్‌-100 స్వల్ప లాభాల్లో ముగిసింది. బ్యాంకింగ్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడితో నిఫ్టీ బ్యాంక్‌ 400 పాయింట్లకు పైగా పడిపోయింది.

కొత్త క్లోజింగ్‌ విధానంతో అస్థిరత

ఎఫ్‌అండ్‌ఓ షేర్ల ముగింపు ధరలను నిర్ణయించే విధానంలో మార్పులు అమల్లోకి రావడంతో ట్రేడింగ్‌ చివరి నిమిషాల్లో తీవ్ర అస్థిరత నెలకొంది. సాధారణ ట్రేడింగ్‌ అనంతరం ప్రత్యేక క్లోజింగ్‌ వేలం ద్వారా తుది ధర నిర్ణయించే కొత్త విధానాన్ని ఎక్స్ఛేంజీలు అమలు చేస్తున్నాయి. చివరి నిమిషాల్లో భారీ కొనుగోలు, అమ్మకాల ఆర్డర్ల ప్రభావాన్ని తగ్గించడమే దీని ఉద్దేశం. ఈ విధానం మ్యూచువల్‌ ఫండ్లకు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉన్నప్పటికీ, యాక్టివ్‌ ట్రేడర్లు, ప్రొప్రైటరీ ట్రేడింగ్‌ డెస్క్‌లపై ఎక్కువ ప్రభావం చూపనుంది.

ప్రారంభ దశ సమస్యలే: నిపుణులు

జియోజిత్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ పరిశోధన విభాగాధిపతి వినోద్‌ నాయర్‌ మాట్లాడుతూ.. వారాంత ఎఫ్‌అండ్‌ఓ గడువు ముగింపు, కొత్త క్లోజింగ్‌ విధానం కలిసివచ్చి మార్కెట్‌లో అసాధారణ ఒడిదుడుకులకు కారణమయ్యాయని తెలిపారు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 3.40 గంటల మధ్య నిఫ్టీ షేర్ల ముగింపు ధరలు, సూచీ విలువల మధ్య భారీ వ్యత్యాసాలు కనిపించడం కొత్త విధానంలో లోపాలను సూచిస్తున్నాయని చెప్పారు. దీనివల్ల ముఖ్యంగా రిటైల్‌ ట్రేడర్లు తమ పొజిషన్లను బలవంతంగా ముగించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

అయితే ఇవి కొత్త విధానంలో ప్రారంభ దశలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలేనని, ఎక్స్ఛేంజీలు, మార్కెట్‌ నియంత్రణ సంస్థలు త్వరలోనే వీటిని పరిష్కరిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. దీర్ఘకాలిక పెట్టుబడిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దేశ ఆర్థిక వ్యవస్థ బలంగానే ఉందని పేర్కొన్నారు.

రూపాయి స్వల్ప బలహీనత

డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి స్వల్ప మార్పుతో డాలర్‌కు రూ.95.3775 వద్ద ముగిసింది. గత ముగింపు విలువ రూ.95.3375గా నమోదైంది.

లాభపడిన షేర్లు:

  • ట్రెంట్ – ₹3,070.00 (+1.15%)
  • బజాజ్ ఫైనాన్స్ – ₹1,153.00 (+1.06%)
  • బీఈఎల్ – ₹392.00 (+0.94%)
  • టాటా స్టీల్ – ₹190.20 (+0.58%)
  • మహీంద్రా అండ్ మహీంద్రా – ₹3,405.00 (+0.58%)
  • బజాజ్ ఫిన్‌సర్వ్ – ₹2,076.40 (+0.55%)
  • టైటాన్ – ₹4,925.00 (+0.51%)
  • సన్ ఫార్మా – ₹1,960.00 (+0.51%)
  • భారతి ఎయిర్‌టెల్ – ₹1,956.50 (+0.28%)
  • ఈటర్నల్ – ₹310.80 (+0.26%)
  • యాక్సిస్ బ్యాంక్ – ₹1,255.00 (+0.24%)
  • ఎల్ అండ్ టీ – ₹4,006.00 (+0.15%)
  • ఐసీఐసీఐ బ్యాంక్ – ₹1,445.00 (+0.06%)
  • మారుతి – ₹14,111.00 (+0.05%)
  • అల్ట్రాటెక్ సిమెంట్ – ₹11,955.00 (+0.04%)
  • టీసీఎస్ – ₹2,450.00 (మార్పు లేదు)

నష్టపోయిన షేర్లు:

  • కోటక్ మహీంద్రా బ్యాంక్ – ₹393.00 (-0.05%)
  • ఐటీసీ – ₹286.00 (-0.10%)
  • ఎస్‌బీఐ – ₹1,035.00 (-0.13%)
  • అదానీ పోర్ట్స్ – ₹1,691.00 (-0.35%)
  • ఏషియన్ పెయింట్స్ – ₹2,745.00 (-0.36%)
  • ఇన్ఫోసిస్ – ₹1,165.00 (-0.43%)
  • హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ – ₹1,356.20 (-0.43%)
  • పవర్ గ్రిడ్ – ₹282.50 (-0.53%)
  • టెక్ మహీంద్రా – ₹1,639.95 (-0.61%)
  • ఇండిగో – ₹5,330.00 (-1.09%)
  • రిలయన్స్ ఇండస్ట్రీస్ – ₹1,293.00 (-1.22%)
  • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ – ₹739.95 (-1.48%)
  • ఎన్‌టీపీసీ – ₹341.95 (-1.63%)
  • హిందుస్థాన్ యూనిలీవర్ – ₹2,084.00 (-1.70%)