స్వర్ణాంధ్ర సాధనకు ఏలూరు నిబద్ధత.

స్వర్ణాంధ్ర సాధనకు ఏలూరు నిబద్ధత.
ప్లాస్టిక్ రహిత ఏలూరు మా లక్ష్యం..
ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యం: ఎమ్మెల్యే బడేటి.
బావిశెట్టివారిపేటలో ‘స్వచ్ఛ ఆంధ్ర’ స్ఫూర్తి..
మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్ ఆధ్వర్యంలో భారీ అవగాహన.
ఏలూరు కార్పొరేషన్, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి కలల స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనకు ఏలూరు నగరం నిబద్ధతతో అడుగులు వేస్తోంది. ‘స్వర్ణా ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా నగరంలో ప్లాస్టిక్ రహిత ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. ఇందులో భాగంగా శనివారం స్థానిక 2వ డివిజన్ బావిశెట్టివారిపేటలోని భూలోకమ్మ తల్లి గుడి వద్ద ‘ప్లాస్టిక్ రహిత రాష్ట్రం’ అవగాహన కార్యక్రమం అత్యంత విజయవంతంగా జరిగింది.ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య , నగరపాలక సంస్థ కో-ఆప్షన్ సభ్యులు ఎస్.ఎం.ఆర్. పెదబాబు ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమానికి వన్నె తెచ్చారు. స్థానిక ప్రజలు, మహిళా సంఘాల సభ్యులు, యువత పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలివచ్చి ప్లాస్టిక్ నిర్మూలనకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ, ముఖ్యమంత్రి దార్శనికతతో రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చే మహాయజ్ఞం ప్రారంభమైంది. ఇది ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదు, ప్రతి ఇంటి బాధ్యత. ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొడితేనే భావితరాలకు స్వచ్ఛమైన భూమి, నీరు, గాలిని అందించగలం. ఇంటి నుంచే మార్పు మొదలవ్వాలి. ప్లాస్టిక్ కవర్లను పూర్తిగా త్యజించి, జనపనార, గుడ్డ సంచులను వాడటం అలవాటు చేసుకోవాలి” అని పిలుపునిచ్చారు. 2వ డివిజన్తో పాటు ఏలూరును ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు ప్రజలందరూ కంకణబద్ధులు కావాలని, ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
నగరపాలక సంస్థ కో-ఆప్షన్ సభ్యులు ఎస్.ఎం.ఆర్. పెదబాబు మాట్లాడుతూ, “స్వచ్ఛ ఆంధ్ర సాధిస్తేనే స్వర్ణాంధ్ర సాధ్యం. ఈ మహత్తర లక్ష్యంతో ఏలూరు నగరపాలక సంస్థ ఇప్పటికే క్షేత్రస్థాయిలో అనేక కార్యక్రమాలు చేపట్టింది. ప్రతి డివిజన్లో అవగాహన సదస్సులు నిర్వహించడంతో పాటు ఉచితంగా క్లాత్ బ్యాగులను పంపిణీ చేస్తున్నాం. ప్రజల స్వచ్ఛంద సహకారం ఉంటే ఏలూరు నగరాన్ని రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దడం ఖాయం” అని ధీమా వ్యక్తం చేశారు.
2వ డివిజన్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి, ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బడేటి, కో-ఆప్షన్ సభ్యులు పెదబాబు స్వయంగా ప్రజలకు గుడ్డ సంచులు పంపిణీ చేశారు. భూలోకమ్మ గుడి పరిసరాలను శుభ్రం చేసి, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే కార్యక్రమంలో వారితో పాటు స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ‘స్వచ్ఛతతోనే సంపద, ఆరోగ్యం’ అనే నినాదం ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపింది. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు సమష్టిగా కదులుతుండటంతో ఏలూరు నగరం ‘ప్లాస్టిక్ రహిత నగరం’గా రూపుదిద్దుకోవడం తథ్యమని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమం స్వర్ణాంధ్ర దిశగా వేసిన మరో బలమైన అడుగు.
