El Nino |వర్షాల కోసం ఎదురుచూపులు.. జూన్ షాక్, జూలై అలర్ట్!
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: జూన్ ముగిసింది.. జూలై ప్రారంభమైంది.. అయినా దేశవ్యాప్తంగా వర్షాల జాడ కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీనికి తోడు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) విడుదల చేసిన తాజా అంచనాలు మరింత నిరాశ కలిగిస్తున్నాయి. దేశంలో ఎల్నినో ప్రభావం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో జూలైలో కూడా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది. మంగళవారం విడుదల చేసిన నెలవారీ వాతావరణ అంచనాల ప్రకారం, జూలైలో దేశవ్యాప్తంగా కురిసే వర్షపాతం దీర్ఘకాల సగటు (LPA)లో 94 శాతం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది. కాగా, 1971-2020 కాలానికి జూలై నెల దీర్ఘకాల సగటు వర్షపాతం 280.4 మిల్లీమీటర్లుగా నమోదైంది.
ఎల్నినో ప్రభావం వల్ల పసిఫిక్ మహాసముద్రంలోని సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దీని ప్రభావం ప్రపంచ వాతావరణ వ్యవస్థపై పడటంతో భారత నైరుతి రుతుపవనాల తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది. ఫలితంగా మేఘాల ఏర్పాటులో మార్పులు చోటుచేసుకుని అనేక ప్రాంతాల్లో వర్షపాతం తగ్గవచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
అత్యంత పొడి జూన్గా నమోదు..
జూన్ నెలలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. 1901 నుంచి నమోదైన భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గణాంకాల ప్రకారం, 2026 జూన్ దేశవ్యాప్తంగా ఐదో అత్యంత పొడి జూన్గా నమోదైంది. సాధారణంగా జూన్ నెలలో 165.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా, ఈ ఏడాది కేవలం 99.5 మిల్లీమీటర్లే కురిశాయి. దీంతో సాధారణంతో పోలిస్తే దాదాపు 40 శాతం వర్షలోటు నమోదైంది. గత శతాబ్దానికి పైగా ఉన్న వాతావరణ రికార్డుల్లో 2026 జూన్ అత్యంత పొడి జూన్ నెలల్లో ఒకటిగా నిలిచిందని ఐఎండీ వెల్లడించింది.
జలాశయాల్లో నీటి నిల్వలు ఆందోళనకరం..
వర్షాభావం ప్రభావం ఇప్పటికే ఖరీఫ్ సాగుపై కనిపిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా వరి, పప్పుధాన్యాలు, సోయాబీన్, పత్తి వంటి పంటల సాగు తగ్గడానికి నేలలో తగినంత తేమ లేకపోవడమే ప్రధాన కారణంగా భావిస్తున్నారు. మరోవైపు, కేంద్ర జల సంఘం (CWC) గణాంకాల ప్రకారం దేశంలోని 166 ప్రధాన జలాశయాల్లో జూన్ 25 నాటికి మొత్తం వినియోగయోగ్య నిల్వ సామర్థ్యంలో కేవలం 26.37 శాతం నీరు మాత్రమే నిల్వ ఉంది.
ఎల్నినో ప్రభావం తగ్గేది ఎప్పుడు?
ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఇండియన్ ఓషన్ డైపోల్ (IOD) అనుకూల దశలోకి వెళ్లే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అలా జరిగితే ఎల్నినో ప్రభావం కొంత మేర తగ్గి, నైరుతి రుతుపవనాలకు మద్దతు లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో జూలై నెల వర్షపాతం వ్యవసాయం, తాగునీటి లభ్యత, జలాశయాల నీటి నిల్వలు, దేశ ఆర్థిక వ్యవస్థపై కీలక ప్రభావం చూపే అవకాశముందని ఐఎండీ పేర్కొంది.
