TG | సింగరేణి భవిష్యత్తుకు యువతరం అధికారులు బాసటగా నిలవాలి : సిఎండి బలరాం

హైదరాబాద్ : సింగరేణి సంస్థలో రానున్న మూడేళ్లలో అనుభవజ్ఞులైన సీనియర్ అధికారులు పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో యువ సింగరేణి అధికారులు ఇప్పటి నుండే సంస్థ ఆర్థిక స్థితిగతులు, భవిష్యత్తు ప్రణాళికలు, వ్యాపార విస్తరణ చర్యలపై అవగాహన కలిగి ఉండాలని, సంస్థ భవిష్యత్తుకు బాసటగా నిలవాలని సంస్థ ఛైర్మన్ , ఎండీ ఎన్.బలరామ్ పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థ చరిత్రలో తొలిసారిగా సింగరేణి వ్యాప్తంగా ఉన్న ద్వితీయ, తృతీయ శ్రేణి అధికారులైన మేనేజర్లు, డిప్యూటీ జనరల్ మేనేజర్లతో ఆయన మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కర్తవ్య ప్రబోధం చేశారు. అన్ని ఏరియాల నుండి వివిధ విభాగాలకు చెందిన సుమారు 762 మంది ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

ఛైర్మన్ తో పాటు సంస్థ డైరెక్టర్లు వివిధ విభాగాల ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ సింగరేణి ప్రస్తుత బొగ్గు ధర దేశంలో ఏ ఇతర బొగ్గు కంపెనీల కన్నా చాలా ఎక్కువగా ఉందని, కనుక వినియోగదారులు తక్కువ ధరకు బొగ్గు లభించే వైపు మొగ్గు చూపుతున్నారని, ఇది చాలా ప్రమాదకరం కనుక కనీసం టన్నుకు వెయ్యి రూపాయలు తగ్గించే విధంగా సింగరేణి వ్యాప్తంగా ఉత్పాదకత పెంచాలని, ఉత్పత్తి వ్యయం తగ్గించాలని, ఇందుకు యువ అధికారులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

పాత గనులు కొన్ని మూతబడుతున్న నేపథ్యంలో, ఒడిశాలోని నైనీ బ్లాకు, కొత్తగూడెంలో వి కే ఓ సి, ఇల్లందులో జే కే ఓసి, బెల్లంపల్లిలో గోలేటి ఓసిల నుండి ఈ ఏడాది బొగ్గు ఉత్పత్తి ప్రారంభించనున్నామని, తద్వారా 20 మిలియన్ టన్నుల అదనపు ఉత్పత్తి సాధించగలమని ధీమా వ్యక్తం చేశారు. కనుక ఈ ఏడాది నిర్దేశిత 76 మిలియన్ టన్నుల లక్ష్యాలు సాధించే అవకాశం ఉందన్నారు.

అలాగే ఇతర రాష్ట్రాలలో కూడా బొగ్గు బ్లాకులు చేపట్టడానికి సింగరేణి సంస్థ ముమ్మరంగా ప్రయత్నిస్తోందన్నారు.కానీ రానున్న కాలంలో సింగరేణి సంస్థ కేవలం బొగ్గు ఉత్పత్తి పైనే ఆధారపడి మనుగడ సాధించలేదని స్పష్టం చేశారు. పర్యావరణ ఆంక్షలు, బొగ్గు నిల్వల తరుగుదల వల్ల మరో 20 ఏళ్లలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోతుందని, తద్వారా బొగ్గు ఉత్పత్తి కూడా తగ్గుతుందన్నారు. కనుక సింగరేణి సంస్థ కీలక ఖనిజాల ఉత్పత్తి రంగంలోకి అడుగు పెట్టాలని నిర్ణయించిందని, కేంద్ర ప్రభుత్వం కూడా కీలక ఖనిజాల ఉత్పత్తిదారులకు సంపూర్ణ ప్రోత్సాహం ఇస్తున్నందువల్ల ఈ రంగంలో సింగరేణి మంచి అవకాశాలు ఉండబోతున్నాయని పేర్కొన్నారు.

అలాగే ఇతర ఖనిజాల ఉత్పత్తి రంగంలోకి కూడా సింగరేణి అడుగుపెడుతోందని, దీనికోసం మూడు ఏజెన్సీలను కూడా నియమించుకోవడం జరిగిందన్నారు. అవసరమైతే ఇతర కంపెనీలతో కలిసి జాయింట్ వెంచర్ గా కూడా ఈ రంగాల్లో ముందుకు వెళ్తామన్నారు. ఇప్పటికే సింగరేణి ఓవర్ బర్డెన్ నుంచి ఇసుక తయారీ యూనిట్లను ఏర్పాటు చేసిందని, అలాగే ఫ్లై యాష్ నుండి, కార్బన్ డయాక్సైడ్ నుండి ఇతర ఉత్పత్తులు సాధించడానికి రంగం సిద్ధమైందన్నారు. దీనికి ముందస్తుగా సింగరేణి ప్రాంతంలో జియో కెమికల్ లేబరేటరీ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

రానున్న కాలంలో రాష్ట్ర ప్రభుత్వం వారు 20వేల మెగావాట్ల సోలార్ విద్యుత్తు ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నారని, దీనిలో సింగరేణి కనీసం నాలుగు నుంచి ఐదు వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి పూనుకోవాల్సి ఉందన్నారు. ప్రస్తుత 1200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పాదనను 800 మెగావాట్ల కొత్త ప్లాంట్ ఏర్పాటు ద్వారా 2000 మెగావాట్లకు పెంచుతున్నామని, ఒడిశాలో మరో 1600 మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. తద్వారా రాష్ట్రంలో అత్యధిక థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి సంస్థగా సింగరేణి నిలవబోతుందన్నారు. సింగరేణి బహుముఖ విస్తరణ చర్యల పైన, ఆర్థిక స్థితిగతుల పైన భవిష్యత్తులో సింగరేణికి నాయకత్వం వహించనున్న నేటి యువ అధికారులకు సంపూర్ణ అవగాహన ఉండాలన్న ఉద్దేశంతోటే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ల ద్వారా వివిధ విషయాలను లోతుగా వివరించారు. ఆ తరువాత ఏరియాల నుండి యువ అధికారులు తమ సలహాలను, సూచనలను, సందేహాలను కూడా వ్యక్తం చేశారు. సింగరేణి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది.

కొత్తగూడెం నుంచి నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఛైర్మన్ తో పాటు, డైరెక్టర్లు డి.సత్యనారాయణ రావు, ఎల్.వి.సూర్యనారాయణ, కె.వెంకటేశ్వర్లు, జీఎం సి పి పి మనోహర్, కార్పోరేట్ జీఎం లు ఇంకా వివిధ విభాగాల అధికారులు, హైదరాబాద్ కార్యాలయం నుండి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ ఎస్.డి.ఎం.సుభాని, జీఎం మార్కెటింగ్ ఎన్.వి.రాజశేఖర్ రావు, అన్ని ఏరియాల జీఎం లు పాల్గొన్నారు.

Leave a Reply