ఈ-విధంగా ఇంధన పొదుపు..

ఈ-విధంగా ఇంధన పొదుపు..
ఎలక్ట్రికల్ సైకిల్పై కలెక్టరేట్కు వెళ్లిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
నా దేశం – నా బాధ్యతతో పొదుపు చర్యలకు శ్రీకారం
పర్యావరణహిత, ఆదా సహిత జీవనశైలిపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యం
సీఎం పిలుపునకు అనుగుణంగా యంత్రాంగం అడుగులు
విజయవాడ, ఆంధ్రప్రభ : ప్రపంచ వ్యాప్త సంక్షోభం నేపథ్యంలో ప్రతిఒక్కరూ నా దేశం-నా బాధ్యత నినాదంతో పొదుపు చర్యలను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని.. ఇంధన ఆదాతో ఆర్థికంగా లాభంతో పాటు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావొచ్చని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. కలెక్టర్ లక్ష్మీశ శనివారం ఉదయం నగరంలోని క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టరేట్కు ఎలక్ట్రికల్ సైకిల్పై వెళ్లారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర, ఆత్మనిర్భర్ భారత్ దిశగా ఒక్కో అడుగు ముందుకేస్తున్నామని.. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఖర్చులను నియంత్రిస్తూ, అందుబాటులో ఉన్న వనరులను పొదుపుగా వినియోగించుకోవాలన్న ముఖ్యమంత్రి పిలుపునకు అనుగుణంగా ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం కార్యాచరణ ప్రారంభించిందని తెలిపారు. ఇందులో భాగంగా డీజిల్, పెట్రోలు వాహనాలకు బదులు ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగం దిశగా ప్రజలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ రోజు ఎలక్ట్రికల్ సైకిల్పై కార్యాలయానికి వెళ్లినట్లు వివరించారు.

స్థానిక యువత రూపొందించిన ఈ-సైకిళ్లు చాలా బాగున్నాయని, ఇలాంటి ఇన్నొవేషన్స్ను ప్రతిఒక్కరూ ప్రోత్సహించాల్సిన అవసరముందన్నారు. ప్రతి శుక్రవారం నో వెహికల్ డేను పాటించేలా అధికారులను ప్రోత్సహిస్తున్నామని, స్థానికంగా సందర్శనలు, తనిఖీలకు విద్యుత్ సైకిళ్లు, అదేవిధంగా దూర ప్రాంతాలకు విద్యుత్ వాహనాలను వినియోగించేలా అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. దేశ భవిష్యత్తు దృష్ట్యా ప్రతిఒక్కరూ పర్యావరణ పరిరక్షణతో పాటు ఆర్థిక పొదుపును సాధించే జీవనశైలిని అలవరచుకోవాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో ప్రభుత్వ యంత్రాంగం ముందుండి ప్రజలకు ఆదర్శంగా నిలుస్తుందని స్పష్టం చేశారు. తాను ఇప్పటికే రెండు చిట్టి పాంథర్ విద్యుత్ సైకిళ్లను కొనుగోలు చేశామని.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ సైకిల్పై ఏకధాటిగా 40 కి.మీ. ప్రయాణించవచ్చన్నారు. ఇలాంటి విద్యుత్ వాహనాల సమాచారాన్ని తెలుసుకోవాలనుకునేవారు కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని సంప్రదించవచ్చని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
