Archery World Cup Stage 3 | దక్షిణ కొరియాకు షాక్ ఇచ్చిన భారత్..
Archery World Cup Stage 3 | దక్షిణ కొరియాకు షాక్ ఇచ్చిన భారత్..
- ఒలింపిక్ ఛాంపియన్లపై స్వర్ణ విజయం..
- ధీరజ్-కుంకుమ జోడికి వరల్డ్ కప్ గోల్డ్
ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : టర్కీలోని అంటాల్యాలో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ (Archery World Cup) స్టేజ్-3లో భారత ఆర్చర్లు ధీరజ్ బొమ్మదేవర, కుంకుమ్ మొహోద్ చరిత్ర సృష్టించారు. ఒలింపిక్ ఛాంపియన్ దక్షిణ కొరియా టీంను సంచలనంగా ఓడించి రికర్వ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు.
ఫైనల్లో భారత జోడీ 24 ఏళ్ల ధీరజ్, 17 ఏళ్ల కుంకుమ్ మొహోద్లు దక్షిణ కొరియాకు చెందిన ఓ యే-జిన్, కిమ్ జే-డియోక్ జంటను 5-1 (37-36, 37-36, 39-39) తేడాతో ఓడించి అగ్రస్థానంలో నిలిచారు. ఈ విజయంతో ధీరజ్, కుంకుమ్లకు మిక్స్డ్ టీమ్ విభాగంలో ఇది తొలి వరల్డ్ కప్ స్వర్ణ పతకంగా నిలిచింది.
మ్యాచ్ మొత్తం భారత జంట సూపర్ ఫామ్ ప్రదర్శించింది. కీలక సమయంలో ధీరజ్ బొమ్మదేవర చివరి రెండు బాణాలను కచ్చితంగా 10 పాయింట్లకు గురి చేసి జట్టుకు విజయాన్ని ఖాయం చేశాడు. ఒత్తిడిని అధిగమిస్తూ భారత జోడీ ప్రదర్శించిన ఆటకు అభిమానులు, క్రీడా విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇదిలా ఉండగా… భారత టాప్ ర్యాంక్ ఆర్చర్గా కొనసాగుతున్న ధీరజ్ వ్యక్తిగత విభాగం సెమీఫైనల్లోనూ బరిలోకి దిగనున్నాడు. మరో పతకంపై అతడు కన్నేశాడు.
ఇక కుంకుమ్ మొహోద్ ఇటీవల షాంఘైలో జరిగిన వరల్డ్ కప్ స్టేజ్-2లో భారత మహిళల రికర్వ్ జట్టుతో కలిసి స్వర్ణ పతకం గెలిచి ఇప్పటికే తన ప్రతిభను చాటుకుంది.

కాగా, వరల్డ్ కప్ దశలో భారత రికర్వ్ మిక్స్డ్ టీమ్ చివరిసారిగా 2022లో అంటాల్యాలోనే స్వర్ణ పతకం గెలిచింది. అప్పట్లో రిధి ఫోర్, తరుణ్దీప్ రాయ్ జోడీ గ్రేట్ బ్రిటన్ను ఓడించి టైటిల్ సాధించింది. మూడేళ్ల తర్వాత మళ్లీ అదే వేదికపై భారత్ స్వర్ణ విజయాన్ని పునరావృతం చేయడం విశేషం.
