సీఎం పర్యటనకు ముందే నరసన్నపేట ఏరియా ఆసుపత్రి సన్నాహాలు
సీఎం పర్యటనకు ముందే నరసన్నపేట ఏరియా ఆసుపత్రి సన్నాహాలు
- డీసీహెచ్ఎస్ విజయలక్ష్మి రెండోసారి పరిశీలన
నరసన్నపేట, ఆంధ్రప్రభ: ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో నరసన్నపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని శుక్రవారం డీసీహెచ్ఎస్ కె.వి. విజయలక్ష్మి రెండోసారి సందర్శించి, ఆసుపత్రిలో జరుగుతున్న సన్నాహాలను పరిశీలించారు. ఈ సందర్శనలో ముఖ్యమంత్రి పర్యటన సమయంలో ఎలాంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితులు తలెత్తినా వెంటనే వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.
విజయలక్ష్మి, ఆసుపత్రిలో వీఐపీ గది ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా వీఐపీలకు లేదా ఇతర వ్యక్తులకు ఆకస్మిక ఆరోగ్య సమస్యలు ఎదురైనపుడు తక్షణమే చికిత్స అందించేందుకు ఈ గది ఉపయోగకరమని తెలిపారు.
అలాగే వైద్య సిబ్బందిని రెండు ప్రత్యేక బృందాలుగా విభజించారని చెప్పారు. ఒక బృందం హెలిప్యాడ్ సమీపంలో అత్యవసర పరిస్థితుల కోసం అందుబాటులో ఉంచబడినట్లుగా, హెలిప్యాడ్ వద్ద ప్రత్యేక మెడికల్ శిబిరం ఏర్పాటు చేయబడినట్లు వివరించారు. మరో బృందం ఆసుపత్రిలో సిద్ధంగా ఉండి అవసరమైన వైద్య సేవలు అందించనుంది.
డీసీహెచ్ఎస్ ఆసుపత్రిలో జరుగుతున్న డోర్ల మరమ్మతులు, గదుల రిపేర్లు, మౌలిక సదుపాయాల పనులు పరిశీలించారు. మొత్తం 15 వేల వరకు వ్యయంతో జరిగే మరమ్మత్తు పనులను ఈరోజే పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు.
అసుపత్రి సిబ్బందిని అన్ని విభాగాల్లో సౌకర్యాలు అందుబాటులో ఉండేలా, పారిశుధ్యం, వైద్య పరికరాల సిద్ధత, అత్యవసర సేవల నిర్వహణలో లోపాలు రాకుండా అప్రమత్తంగా ఉండాలని డీసీహెచ్ఎస్ ఆదేశించారు.
