ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు
ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు
- ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిన గొప్ప నాయకుడు
- యువత రాజీవ్ గాంధీని ఆదర్శంగా తీసుకోవాలి
మేడ్చల్, ఆంధ్రప్రభ: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పరిధిలోని గుండ్లపోచంపల్లి (299 డివిజన్)లో భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కుండ భానుచందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, మాజీ సర్పంచులు, కౌన్సిలర్లు పాల్గొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ పని చేసినా ఎంతో దూరదృష్టితో ఆలోచించే గొప్ప నాయకుడని గుర్తుచేశారు. దేశ సాంకేతిక ప్రగతికి బాటలు వేసిన రాజీవ్ గాంధీని ప్రతి ఒక్క యువకుడు ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పేద, మధ్యతరగతి ప్రజల పక్షాన ఉంటుందనడానికి రాజీవ్ గాంధీ పాలనే నిదర్శనమన్నారు. ప్రస్తుతం ఆయన అడుగుజాడల్లోనే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నడుస్తున్నారని పేర్కొన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గొప్ప సంకల్పంతో ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువస్తున్నారని నాయకులు కొనియాడారు. రాష్ట్రంలో అద్భుతమైన పథకాలను అమలు పరుస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్తున్న ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎల్లప్పుడూ అండగా ఉంటారని వారు ధీమా వ్యక్తం చేశారు.
ఈ వర్ధంతి వేడుకల్లో మాజీ జెడ్పీటీసీ, మాజీ కౌన్సిలర్, డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిపేట శ్రీనివాస్, బండారి నరేందర్, మాజీ సర్పంచ్ గరిసెల సురేందర్, ఓబీసీ సెల్ అధ్యక్షులు గువ్వ రవి, ఆలయ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. అలాగే ఐఎన్టీయూసీ నాయకులు కావేరి శేఖర్, అమరం సురేష్ రెడ్డి, దొడ్ల మోహన్, వినోద్ గౌడ్, కావలి భాస్కర్, ఉదయ్ గౌడ్, సంపత్ గౌడ్, మలిగే కిషన్, బండారి వెంకట్, కుండ ప్రవీణ్ కుమార్, ఎస్.కే షబ్బీర్, ప్రసాద్, మండల రాజు తదితర కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
