2june | మళ్లీ గేదెలు, గొర్రెలు, మేకలు, కోళ్ల పంపిణీ

2june | మళ్లీ గేదెలు, గొర్రెలు, మేకలు, కోళ్ల పంపిణీ
2june | జూన్ రెండో తేదీ నుంచి మహిళలకు అందజేత
పశువైద్య వర్సిటీతో సెర్ప్ అవగాహన ఒప్పందం
బ్యాంకు లింకేజీతో ఆర్థిక తోడ్పాటు
గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబన కోసమే ఈ పథకం
2june | హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణలోని గ్రామీణ మహిళల ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే దిశగా రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) మరో ముందడుగు వేసింది. మహిళా సంఘాల సభ్యులను పారిశ్రామికవేత్తలుగా మార్చి, వారి ఆర్థిక సాధికారతకు బాటలు వేసేలా జూన్ 2 నుంచి ఒక వినూత్న పథకాన్ని ప్రారంభించబోతోంది. పశుసంపద వృద్ధి ద్వారా స్వయం సహాయక సంఘాల అభ్యున్నతే లక్ష్యంగా రూపొందించిన ఈ పథకం కోసం పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయంతో సెర్ప్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర మంత్రి సీతక్క ఆదేశాల మేరకు రూపొందించిన ఈ పథకం కింద గ్రామీణ మహిళలతో వివిధ రకాల యూనిట్లను ఏర్పాటు చేయించనున్నారు. వీటిలో ప్రధానంగా పొట్టేళ్ల పెంపకం ద్వారా ఆదాయం పెంచేలా యూనిట్ల ఏర్పాటు చేయనన్నారు. శాస్త్రీయ పద్ధతిలో గొర్రెలు, మేకల పెంపక కేంద్రాల నిర్వహణతో పాటు.. నాటుకోళ్లు, ఈము పక్షుల కొనుగోళ్లు, పెంపకం యూనిట్ల స్థాపనకు ఆదేశాలు జారీ చేశారు.
ఆర్థిక తోడ్పాటు.. బ్యాంకు లింకేజీలు
పథకానికి ఎంపికైన మహిళలకు కేవలం యూనిట్లు మాత్రమే కాకుండా, వాటిని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఆర్థిక వనరులను కూడా ప్రభుత్వం సమకూర్చనుంది. బ్యాంకు లింకేజీలు, రివాల్వింగ్ ఫండ్లు, భారీ సబ్సిడీల ద్వారా లబ్ధిదారులకు ఆర్థిక వెన్నుదన్ను అందించనున్నారు. పశువైద్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మహిళా లబ్ధిదారులకు పశుపోషణలో మెళకువలు, వ్యాధి నిరోధక చర్యలపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు.
అవగాహన ఒప్పందంపై సంతకాలు
హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్, పశువైద్య వర్సిటీ రిజిస్ట్రార్ శరత్చంద్ర ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా దివ్యా దేవరాజన్ మాట్లాడుతూ.. గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం తెలంగాణ స్వయం సహాయక సంఘాల అభ్యున్నతికి ఈ ఒప్పందం ఎంతో కీలకంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జూన్ 2న ప్రారంభం కానున్న ఈ పథకం ద్వారా వేలాది మంది గ్రామీణ మహిళల జీవితాల్లో వెలుగులు నిండుతాయని అధికారులు భావిస్తున్నారు.
