Telangana | “దావత్ ఏ ఇఫ్తార్ ” ను ఘనంగా నిర్వహించండి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశం

హైదరాబాద్, :: దావత్ ఏ ఇఫ్తార్ ను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు. అసెంబ్లీ సమావేశ మందిరంలో ఇఫ్తార్ విందు, రంజాన్ పండుగ ఏర్పాట్లను ఆయన మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి నేడు సమీక్షించారు.

ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహించే ఈ కార్యక్రమాలకు ఎలాంటి నిధుల కొరత లేదు అని డిప్యూటీ సీఎం తెలిపారు. ఆహారంలో నాణ్యత, ప్రోటోకాల్, సౌకర్యాల కల్పనలో అధికారులు ఎలాంటి రాజీ పడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఏర్పాట్లలో అధికారులు ఏమాత్రం అశ్రద్ధ వహించరాదని, చిన్న పొరపాటుకు అవకాశం లేకుండా చూడాలని కోరారు. లా అండ్ ఆర్డర్, ఎలక్ట్రిసిటీ, మంచినీరు వాటి అంశాలు ఇబ్బంది లేకుండా చూసుకోవాలన్నారు. ఏర్పాట్లలో ఎలాంటి అనుమానాలు, ఇబ్బందులు ఎదురైనా అధికారులు మొహమాట పడకుండా జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ లేదా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఏర్పాట్లకి సంబంధించి రోజువారి సమీక్షను ప్రభుత్వ సలహాదారు, ఏర్పాట్ల కమిటీ వైస్ చైర్మన్ షబ్బీర్ అలీ రోజువారి సమీక్ష చేస్తారని తెలిపారు.

సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రంజాన్ పవిత్ర మాసంలో ముస్లిం సోదరులకు ఏలాంటి అసౌకర్యం లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. దావత్ ఏ ఇఫ్తార్ కు కూడా ఘనంగా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.

ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ మాట్లాడుతూ త‌మ‌ ప్రభుత్వం దావత్ ఏ ఇఫ్తార్ ను ఘనంగా నిర్వహిస్తుందని అన్నారు. సమావేశంలో అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *