Medical Camp | 30 Sections | కన్నతల్లి, జన్మభూమిని మ‌ర‌వొద్దు

Medical Camp | 30 Sections | కన్నతల్లి, జన్మభూమిని మ‌ర‌వొద్దు

    Medical Camp | గుడివాడ, ఆంధ్ర‌ప్ర‌భ : ఆధునికంగా ఎంత ముందుకు సాగుతున్నా నేటి యువతరం ప్రకృతి సమతుల్యతను పాటిస్తూ, కుటుంబ వ్యవస్థలను కాపాడుకోవాలని పద్మవిభూషణ్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఉత్తర అమెరికా(America) తెలుగు సంఘం ఆధ్వర్యంలో గుడివాడ సత్యనారాయణపురంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(Medical Association) భవనంలో గురువారం నిర్వహించిన ఉచిత వైద్య మెగా శిబిరంలో వెంకయ్య నాయుడు, ఎమ్మెల్యేలు డాక్టర్ కామినేని శ్రీనివాస్, వెనిగండ్ల రాములు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వల చేసి సభా కార్యక్రమాన్ని వెంకయ్య నాయుడు ప్రారంభించారు.

    బాల్య దశలో తన జీవన శెలిని సభ ముఖంగా వెంకయ్య నాయుడు వివరించారు. జై ఆంధ్ర ఉద్యమ కాలం నుండి గుడివాడ అంటే నాకు ఇష్టమని, విద్యార్ది ఉద్యమంలో ఎక్కువగా గుడివాడ వచ్చాననీ ఆయన అన్నారు. కన్న తల్లి, జన్మ భూమిని మర్చిపోకుండా…. నాట్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని(Free Medical Camp) నిర్వహించడం అభినందనీయమ‌న్నారు.

    మనం ఏ స్థాయికి చేరుకున్న మూలాలను మర్చిపోకూడదన్నారు. విదేశాలకు వెళ్ళి సంపాదించుకోవడం కంటే మాతృమూర్తి, మాతృ దేశానికి సేవ చెయ్యడంలో వచ్చే ఆనందం వేరన్నారు.

    జీవన శైలి, మారిన ఆహారపు అలవాట్లతో కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయనీ.. ప్రకృతి సమతుల్యత కనుమరుగవుతున్న రోజుల్లో ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యులు ప్రజలకు అవగాహన కల్పించాలని, సేవా దృక్పథంతో కూడిన వైద్యాన్ని అందించాలని సూచించారు.

    స్మార్ట్ ఫోన్లు(Smart phones), విద్యుత్ పరికరాల వినియోగం, జంక్ ఫుడ్‌లు తినడం వల్ల సమతుల్యత దెబ్బ తింటుందని, ప్రకృతి అందించిన వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నేటి యువతరం కుటుంబ వ్యవస్థను కాపాడుకుంటూ ముందుకు వెళ్లాలని వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు.

    గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము(MLA Venigandla Ramu) మాట్లాడుతూ…. గుడివాడ వచ్చిన వెంకయ్య నాయుడుకు పాదాభివందనం చేస్తున్నానన్నారు. విలువలతో చేసే ప్రతి పనిలో అందరి పాత్ర ఉండాలన్నారు. నేడు నాట్స్ ఆధ్వర్యంలో చాలా మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు.

    సమాజానికి ఇవ్వడంలో నాట్స్ ఎప్పుడు ముందే ఉంటుందనీ, వారు చేసే కార్యక్రమాల్లో నేను ఎప్పుడూ మద్దతుగానే ఉంటాన‌న్నారు. గుడివాడ వైద్యులు ఎప్పుడూ ప్రజా సేవలో ముందే ఉంటున్నారని ఎమ్మెల్యే కొనియాడారు.

    అనంతరం నాట్స్ ప్రతినిధులు, గుడివాడ ఐఎంఏ పెద్దలు వెంకయ్య నాయుడుకు ఎమ్మెల్యే గౌరవ సత్కారం చేశారు. 30 విభాగాలకు(30 Sections) చెందిన వైద్య నిపుణులు శిబిరంలో పాల్గొని వైద్య సేవలు అందించారు.

    ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్(Warehousing Corporation) చైర్మన్ రావి వెంకటరావు, నాట్స్ చైర్మన్ పిన్నమనేని ప్రశాంత్, అధ్యక్షుడు శ్రీహరి మందాడి, గుడివాడ ఐఎంఈ అధ్యక్షుడు డాక్టర్ మాగంటి శ్రీనివాస్, జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, బీజేపీ కన్వీనర్ దావులూరి సురేంద్రబాబు, టీడీపీ నాయకులు పిన్నమనేని బాబ్జి, చేకూరు జగన్మోహన్ రావు, లింగం ప్రసాద్, పట్టణ అధ్యక్షులు దింట్యాల రాంబాబు, మజ్జాడ నాగరాజు, లీగల్ సెల్ నాయకులు గొట్టిపాటి రామకృష్ణ, ఐఎంఏ పెద్దలు డాక్టర్ మన్నెం భవాని శంకర్, డాక్టర్ పాలడుగు వెంకటరావు, నాట్స్, ఐఎంఏ ప్రతినిధులు గుడివాడ ప్రజానీకం తదితరులు పాల్గొన్నారు.

    Leave a Reply