అందరూ ఊహించిందే… ఎన్నికల తర్వాత బాదుడు ఉంటుందని…
అందరూ ఊహించిందే… ఎన్నికల తర్వాత బాదుడు ఉంటుందని…
కంగుతిన్న వాహనదారులు
ఆంధ్రప్రభ వెబ్ (జాతీయం): అందరూ ఊహించిందే జరిగింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెట్రో ఉత్పత్తుల ధరలు పెరుగుతాయని అనుకున్నారు. అనుకున్నది అనుకున్నట్లే అక్షరాల కేంద్ర ప్రభుత్వం చేసింది. ఒకే సారి లీటరుపై మూడు రూపాయలు పెంచింది. పెరిగిన ధరలు ఈ రోజు ఉదయం నుంచే అమలు చేస్తూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.
నిపుణులు హెచ్చరించిన మరుచటి రోజే…
పశ్చిమాసియాలో కొనసాగుతోన్న సంక్షోభం నేపథ్యంలో.. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరిగాయి. అయినప్పటికీ.. ప్రభుత్వరంగ చమరు కంపెనీలు దాదాపు 11 వారాల పాటు ఇంధన ధరలను స్థిరంగా ఉంచాయి. ఈ ప్రకటనలకు ముందే ఇంధన ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందనే వార్తలు దేశంలోని వాహనదారులను ఆందోళనకు గురిచేశాయి. దీంతో పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరారు. ఈ క్రమంలో కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దేశంలో పెట్రోల్ కొరత ఏర్పడిందని ప్రచారం జరిగింది. అయితే దేశంలో కావాల్సినంత నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం పదేపదే చెబుతు వచ్చింది. నిన్న దాదాపు అన్నివర్గాల నిపుణులు దేశ ఆర్థిక వ్యవస్థపై ఆందోళన వ్యక్తం చేశాయి. పెట్రోల్ భారం వేయకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే అవకాశం ఉందని హెచ్చరించింది. రాత్రికి రాత్రి పెట్రో ఉత్పత్తులు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకుని ఈ రోజు తెల్లవారు నుంచే అమలులోకి తెచ్చింది.
ఎన్నికల నేపథ్యంలో…
దేశంలో ఐదు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. పశ్చిమబెంగాల్, తమిళనాడు, పుదేచ్ఛరి, కేరళ, అసోం అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇందులో పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికలు బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలో పెట్రో ఉత్పత్తులు ధరలు పెంచితే ఆ ప్రభావం ఎన్నికలపై పడుతుందని బీజేపీ భావించింది. అందుకే ధరలు పెంచకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ వివిధ రాష్ట్రాల పర్యటన షెడ్యూల్ ఉండేది. ఫలితాలు వచ్చిన వెంటనే ధరలు పెంచితే ప్రధాని పర్యటనలో నిరసన సెగలు ఉంటాయని భావించి వాయిదా వేస్తూ కేంద్రం ఎట్టకేలకు పెంచింది.
భారీగా పెంపు
పెట్రో ఉత్పత్తుల ధరలు భారీగా పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఒకేసారి లీటర్ కు మూడు రూపాయలు పెంచాయి. 2022 ఏప్రిల్ నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు మారలేదు. లోక్సభ ఎన్నికలకు ముందు 2024 మార్చిలో లీటరుకు రూ.2 చొప్పున తగ్గించాయి. వీటితోపాటు కిలో సీఎన్జీ గ్యాస్ ధర కిలోకు రూ.2.50లు పెంచింది.
- ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ పై రూ3.29, డీజిల్పై రూ.3.14 పెంచింది. తాజా ధరలు ప్రకారం
- తెలంగాణలో పెట్రోల్, డీజిల్ పై రూ.3
కంగుతిన్న వాహనదారులు
దేశంలో పెట్రోల్ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయని.. అలాగే దేశంలో ఆయిల్ కొరత వస్తుందని ప్రతిపక్షాలు చెబుతునే వస్తున్నాయి. అయితే దేశంలో ఆయిల్ కొరత లేదని కేంద్ర స్పష్టం చేసింది. దేశంలో 60 రోజులకు సరిపడిన ఆయిల్ నిల్వలు ఉన్నాయని, 45 రోజులకు సరిపడ గ్యాస్ నిల్వలు ఉన్నాయని కేంద్రం ప్రకటించింది. అయితే ఈ నిల్వలు సగం తరిగే వరకూ ధరలు పెంచే అవకాశం ఉండదని వాహనదారులు భావించారు. సాధారణంగా ధరలు పెరుగుతాయి అని ప్రచారం జరిగితే బంకుల వద్ద వాహనదారులు బారులు తీరి కనీసం పది రోజులకు సరిపడినంత ఆయిల్ తమ వాహనంలో నిల్వ చేసుకుంటారు. కానీ ఎక్కడ లీకులు ఇవ్వకుండా నిల్వలు బాగా ఉన్నాయని చెబుతూ ఆకస్మికంగా ధరలు పెంచేశారు. దీంతో ఈ రోజు ఉదయం బంకు వెళ్లిన వాహనదారులు ధరలు చూసి కంగుతిన్నారు.
