తుమ్మలని విమర్శించే అర్హత పువ్వాడకు లేదు…

తుమ్మలని విమర్శించే అర్హత పువ్వాడకు లేదు…

  • రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు

ఖమ్మం బ్యూరో, ఆంధ్ర‌ప్ర‌భ : వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పై మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు మండిపడ్డారు. తుమ్మల నాగేశ్వరరావును విమర్శించే నైతిక హక్కు ఆయనకు లేదన్నారు. పువ్వాడ అజయ్ కుమార్ తన రాజకీయ జీవిత చరిత్ర తెలుసుకోవాలని ఆయన హితవుపలికారు. అజయ్ కుమార్ మొదట సీపీఐ పార్టీ అని ఆ తర్వాత వైయస్సార్ సీపీలో చేరారన్నారు.

అందులో నుంచి మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరి అసెంబ్లీ టిక్కెట్ తెచ్చుకుని గెలిచి BRS పార్టీ లో చేరింది నిజం కాదా అని ప్రశ్నించారు. మూడెకరాల భూమిని 59 జీవోని అడ్డం పెట్టుకుని రెగ్యులరైజ్ చేసుకున్నాడని ఆయన విమర్శించారు. మెడికల్ కాలేజ్ కోసం నిన్ను ఓట్లేసి గెలిపించిన ప్రజలను నట్టేట ముంచి BRS పార్టీ లో చేరిన విషయం అందరికీ తెలిసిందే అని ఆయన అన్నారు. మంత్రి పదవి కోసం సొంత పార్టీ వారిని ఓడించింది అజయ్ కుమార్ అని ఆయన ఆరోపించారు.

ఆనాడు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రమ్మంటే తుమ్మల నాగేశ్వరరావు వచ్చారని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉండి ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం ఆయన పనిచేసారన్నారు. కేసీఆర్ తన అవసరం కోసం తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోయిన పార్టీ లో చేర్చుకుని మంత్రి పదవి ఇచ్చారని ఆయన తెలిపారు. తర్వాత కాలంలో తుమ్మల నాగేశ్వరరావు ను ఓడించి నువ్వు మంత్రి పదవి పొందిన విషయం జిల్లా ప్రజలకు తెలుసాన్నారు.

నీలాగా ప్రభుత్వ భూములను రెగ్యులరైజ్ చేయించుకోవడం, మెడికల్ కాలేజ్ లు తెచ్చుకోవడం, కాంట్రాక్టర్లను బెదిరించలేదని ఆయన చెప్పారు. జిల్లా అభివృద్ధి కోసం ఏ పార్టీ లో ఉన్న పని చేస్తున్నరన్నారు. యూరియా కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తుందని తెలియని అజ్ఞాని పువ్వాడ అజయ్ కుమార్ అని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం సరిపడా యూరియా అందించప్పటికీ ఒక యాప్ పెట్టి రైతులకు యూరియా అందించారన్నారు. ఈ సంవత్సరం వరి, మొక్కజొన్న అధికంగా పండింది నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు.

ఖరీఫ్ సీజన్లో అరవై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందని ఆయన తెలిపారు. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ముప్పై సెంటర్ల ద్వారా మొక్కజొన్న రోజుకు పది వేల క్వింటాళ్ల కొనుగోలు చేసేది కనిపించడం లేదా అని ఆయన మండిపడ్డారు. ఒకరిని విమర్శించే ముందు తన రాజకీయ చరిత్ర తెలుసుకోవాలని ఆయన విమర్శించారు.

తుమ్మల నాగేశ్వరరావు అనుభవం అంత వయస్సు నీకు లేదు అయిన ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు మారావు, భవిష్యత్తు లో ఇంకెన్ని మారుతావో అని ఆయన అన్నారు. నీ అక్రమ సంపాదన కోసం పార్టీ లు మారుతున్నావని ఆయన దుయ్యబట్టారు. ప్రజలు ఒకసారి బుద్ధి చెప్పారని మళ్లీ బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఖమ్మం ప్రజలు బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు.

Leave a Reply