డబుల్ బెడ్ రూమ్ గృహాన్ని తిరిగి అప్పగించిన దంపతులు

పెద్దపల్లి, ఆంధ్రప్రభ : పెద్దపల్లి జిల్లాకు చెందిన వరహగిరి శైలజ, భర్త వెంకటరావు దంపతులు సోమవారం కలెక్టరేట్ లో ప్రభుత్వంచే మంజూరైన డబుల్ బెడ్ రూమ్ గృహాన్ని స్వచ్ఛందంగా జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్షకు తిరిగి అప్పగించారు. తమ పిల్లలు సాఫ్ట్వేర్ ఉద్యోగం లో స్థిరపడిన నేపథ్యంలో తమకు ఈ గృహం అవసరం లేదని భావించి, వేరే నిరుపేద కుటుంబానికి కేటాయించాలని సోమవారం రోజున పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గృహాన్ని తిరిగి అప్పగించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ.. అవసరం లేకపోయినా ప్రభుత్వ ఆస్తిని తిరిగి ఇచ్చిన శైలజ దంపతులు నిజాయితీకి నిదర్శనమన్నారు. ఇలాంటి వ్యక్తి సమాజానికి ఆదర్శంగా నిలుస్తారని ఆయన అభినందించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు నిజంగా అవసరమైన వారికి అందేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.