Governor | మరిన్ని అత్యున్నత శిఖరాలను అధిరోహించండి..

Governor | మరిన్ని అత్యున్నత శిఖరాలను అధిరోహించండి..
- తెలంగాణ కీర్తిని దశ దిశలా చాటండి.
Governor | హైదరాబాద్, ఆంధ్రప్రభ : భారత రాష్ట్రపతిచే బాల్ పురస్కార్ అవార్డు(Ball Puraskar Award)–2025 అందుకున్న మాస్టర్ కార్తికేయ్, ఆయన కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ వద్దకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ(Red Cross Society) మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా శాఖ చైర్మన్ డా. ఎస్.ఎం. రాజేశ్వర్ రావు తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా రాజేశ్వరరావు మాస్టర్ కార్తికేయ్ భారతదేశంలోనే అతి పిన్న వయసులో, అలాగే ప్రపంచంలో రెండవ అతి పిన్న వయసు పర్వతారోహకుడిగా ప్రతిష్టాత్మకమైన సెవెన్ సమ్మిట్స్(Seven Summits) ఛాలెంజ్ను 16 ఏళ్ల వయసులో విజయవంతంగా పూర్తి చేశారని వివరించారు.
ఆయన 11 ఏళ్ల వయసులోనే తన పర్వతారోహణ ప్రయాణాన్ని ప్రారంభించి ఈ అసాధారణ విజయాన్ని సాధించేందుకు ఎదురైన కష్టాలు, క్రమశిక్షణ, పట్టుదల గురించి గవర్నర్కు వివరించారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ మాస్టర్ కార్తికేయ్ సాధించిన ఈ అసాధారణ విజయాన్ని అభినందిస్తూ, ఆయన ధైర్యసాహసాలు, దృఢ సంకల్పాన్ని ప్రశంసించారు. రాబోయే రోజుల్లో ప్రపంచంలో మరిన్ని ఉన్నత పర్వతారోహణలు అధిరోహించి దశ దిశలో పేరు ప్రఖ్యాతలు సాధించాలని గవర్నర్(Governor) ఆకాంక్షించారు.

అంచలంచలమైన ఆత్మవిశ్వాసంతో ప్రపంచ హద్దులు దాటుతూ అత్యున్నత శిఖరాలను అధిరోహించడం అసమాన్యమని ప్రశంసించారు. అతిపిన్న వయసులో అత్యున్నత శిఖరాలను అధిరోహించి ప్రపంచంలోనే నంబర్ వన్ గా నిలవాలని సూచించారు. ఆ లక్ష్యం సాధించేవరకు కృషి పట్టుదలతో ముందుకెళ్లాలని గవర్నర్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఇలాంటి ప్రతిభావంతమైన యువ విజయవంతులకు తగిన ప్రోత్సాహం అందించాలని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, మెద్చల్–మల్కాజ్గిరి జిల్లా శాఖ చైర్మన్ ని ఆదేశించారు. కార్తికేయకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని గవర్నర్ పేర్కొన్నారు.
