న్యూ ఢిల్లీ – ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మరణించారు. ఈ కీలక పరిణామంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. బుధవారం ఉదయం జరిగిన ఈ ఆపరేషన్లో మొత్తం 27 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు, వారిలో బసవరాజు కూడా ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారని ఆయన తెలిపారు. బసవరాజు తలపై రూ.1.5 కోట్ల భారీ రివార్డు ఉందని అధికారులు వెల్లడించారు.
నక్సలిజం నిర్మూలనలో కీలక విజయం: అమిత్ షా
ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ, “నక్సలిజం నిర్మూలన దిశగా సాగుతున్న పోరాటంలో ఇదొక మైలురాయి లాంటి విజయం. ఛత్తీస్గఢ్లోని నారాయణ్పూర్లో జరిగిన ఆపరేషన్లో 27 మంది మావోయిస్టులు హతమయ్యారు. వీరిలో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, నక్సల్ ఉద్యమానికి వెన్నెముకగా భావించే నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు కూడా ఉన్నారు” అని పేర్కొన్నారు.
గత మూడు దశాబ్దాలుగా నక్సలిజానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో, పార్టీ ప్రధాన కార్యదర్శి స్థాయి నేత మరణించడం ఇదే మొదటిసారని అమిత్ షా తెలిపారు. భద్రతా దళాల సాహసోపేత చర్యలను ఆయన అభినందించారు. “ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పూర్తయిన తర్వాత ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కలిపి 54 మంది నక్సలైట్లు అరెస్టు కాగా, 84 మంది లొంగిపోయారు. 2026 మార్చి 31 నాటికి దేశం నుంచి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు మోదీ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది” అని అమిత్ షా తన ఎక్స్ పోస్టులో వివరించారు.