సంగారెడ్డి : హైడ్రా కమిషనర్ రంగనాథ్ అమీన్ పూర్ మున్సిపాలిటీలో పర్యటించారు. మున్సిపాలిటీలోని ఐలాపూర్ రాజగోపాల్ నగర్, చక్రపురి కాలనీ అసోసియేషన్ సభ్యులతో సమావేశమయ్యారు. ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితుల ఫిర్యాదు మేరకు శుక్రవారం ప్లాట్ల వద్దకు వచ్చి బాధితులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి ప్లాట్ల ఫిజికల్ పొజిషన్ ను పరిశీలించి వారి సమస్యను కూలంకషంగా అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలకు వెంటనే పరిష్కారం చూపుతానని బాధితులకు భరోసా ఇచ్చారు.
కాగా, హైడ్రా కమిషనర్ రంగనాథ్, న్యాయవాది ముఖీంకు మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. న్యాయవాది ముఖీంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అతితెలివి చూపవద్దంటూ రంగనాథ్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. హైడ్రా లీగాల్టీ గురించి మీరు మాట్లాడనవసరం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు ఏదైనా సమస్య ఉంటే తమకు తెలియజేయాలని కమిషనర్ అన్నారు. రెండు వారాల్లో లోతుగా పరిశీలించి ఇరువర్గాల వారు చెప్పినది వింటామని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. అలాగే కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటామని, అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని త్వరలోనే పరిష్కారం చూపుతామన్నారు. ఇక్కడ కొంతమంది భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నట్లుగా అర్థమవుతుందని కమిషనర్ అన్నారు.