వన్ నేషన్.. మనకు అందించిన గొప్ప వరం
హైదరాబాద్ (ఆంధ్రప్రభ) : భారతదేశ ఉక్కు మనిషి, అఖండ భారత్ నిర్మాత సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని, దేశ వ్యాప్తంగా ‘రాష్ట్రీయ ఏక్తా దివాస్’ (జాతీయ ఐక్యతా దినోత్సవం) సందర్భంగా, హైదరాబాద్ సిటీ పోలీసులు ఇవాళ ఉదయం ‘రన్ ఫర్ యూనిటీ’ ని ఘనంగా నిర్వహించినారు. ఈ రన్ ను పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్, హైదరాబాద్తో పాటు సిటీ పోలీస్ పరిధిలోని ఏడు జోన్లలో ఘనంగా నిర్వహించారు. ఈ ‘రన్ ఫర్ యూనిటీ’ లో సుమారు 5000 మంది నగర వాసులు, రన్నర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి కొణిదెల చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు డిజిపి బి. శివధర్ రెడ్డి, ఈగల్ టీం డైరెక్టర్ సందీప్ శాండిల్య, అదనపు డిజిపి యం.యం. భగవత్, హైదరాబాద్ పోలీసు కమిషనర్ వి.సి. సజ్జనార్, జాయింట్ సిపి తఫ్సీర్ ఇక్బాల్, ట్రాఫిక్ జాయింట్ సిపి డి. జోయల్ డెవిస్ ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి, సినీ హీరో కొణిదెల చిరంజీవి మాట్లాడుతూ.. సర్దార్ పటేల్ దృఢ సంకల్పం, విజన్, కార్యదీక్షత నేటి తరానికి ఆదర్శనీయం అని అన్నారు. 560 ముక్కలైన దేశాన్ని ఒక్కటి చేసి, ‘వన్ నేషన్’ ని మనకు అందించిన గొప్ప వరం సర్దార్ పటేల్ అని తెలిపారు. ‘యూనిటీ ఇన్ డైవర్సిటీ’ అనే పటేల్ సందేశాన్ని పోలీసులు ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడం అభినందనీయమన్నారు. ‘డీప్ ఫేక్’ అనేది పెద్ద గొడ్డలిపెట్టు లాంటిదని, ఈ సమస్యను డీజీపీ , హైదరాబాద్ సీపీ సజ్జనార్ లు సీరియస్గా తీసుకుని స్వయంగా పర్యవేక్షిస్తున్నారని, ప్రజలకు పోలీసులు అండగా ఉన్నారని చెప్పారు.
అనంతరo డిజిపి బి. శివధర్ రెడ్డి మాట్లాడుతూ… ఇది కేవలం ‘పరుగు’ మాత్రమే కాదని, అందరూ జాతీయ ఐక్యత కోసం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన కార్యక్రమన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ తన పట్టుదలతో 560కు పైగా ముక్కలైన సంస్థానాలను ఏకతాటిపైకి తెచ్చి దేశాన్ని బలోపేతం చేశారని కొనియాడారు. యవత సర్దార్ వల్లభాయ్ పటేల్ ను ఆదర్శంగా తీసుకుని మంచి సమాజ నిర్మాణం కోసం పాటుపడాలని హైదరాబాద్ సిపి వీసీ సజ్జనార్ తెలిపారు. సైబర్ నేరాల విషయంలో ప్రజలు ఆందోళన చెందవద్దన్నారు. ముఖ్యంగా, ‘డీప్ ఫేక్’ అంశాన్ని సీరియస్గా తీసుకుని సైబర్ నేరస్థుల మూలాల పై దృష్టి సారించామన్నారు. పిల్లలు 5,000 ,10,000 కోసం సైబర్ నేరస్థులకు మ్యూల్ అకౌంట్స్ ఇవ్వడం వల్ల వారు చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమములో హైదరాబాదు సిటీ పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

