ఉపాధ్యాయుల పీఆర్సీ వెంటనే అమలు చేయాలి
పెండింగ్లో ఉన్న డీఏలు, ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్
ఊట్కూర్, ఆంధ్రప్రభ: ప్రభుత్వం ఉపాధ్యాయుల పెండింగ్లో ఉన్న పీఆర్సీని వెంటనే అమలు చేయాలని టీఎస్యూటీఎఫ్ నారాయణపేట జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి, జిల్లా కార్యదర్శి రవికుమార్ డిమాండ్ చేశారు.
బుధవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో టీఎస్యూటీఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 2023 జూలై 1 నుంచి అమలు కావాల్సిన పీఆర్సీని వివిధ కారణాలు చూపుతూ మూడు సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ అమలు చేయకపోవడం సమంజసం కాదన్నారు.
పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించి అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. లేనిపక్షంలో టీఎస్యూటీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఉపాధ్యాయులకు సంబంధించిన ఆరు డీఏలు పెండింగ్లో ఉన్నాయని, ఇతర సమస్యలు కూడా పరిష్కారం కాకుండా అలాగే ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో టీఎస్యూటీఎఫ్ ఊట్కూర్ మండల అధ్యక్షుడు రాజు, ప్రధాన కార్యదర్శి మోహన్, మండల నాయకులు బాలు, శివరాజు తదితరులు పాల్గొన్నారు.
