నంద్యాల బ్యూరో, మే 2 (ఆంధ్రప్రభ) : నంద్యాల జిల్లా పరిధిలో ఉన్న తెలుగుగంగ ప్రాజెక్టు నిర్మాణాలను, పంట కాల్వలను తక్షణమే పూర్తి చేసి పలు మండలాల్లోని ప్రజలకు తాగు, సాగు నీరు అందించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి ప్రభుత్వానికి విజ్ణప్తి చేశారు. శుక్రవారం రుద్రవరం మండల తహసీల్దారు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. రాయలసీమలో తాగు, సాగునీటి కోసం 80వ దశకంలో చేపట్టిన కరువు బండ ఉద్యమాన్ని గౌరవించి, ఆనాటి సీఎం ఎన్టీ రామారావు రాయలసీమకు తాగు, సాగు నీరు ఇస్తూ తెలుగుగంగ ప్రాజెక్టును ప్రారంభించారని పేర్కొన్నారు.
శ్రీశైలం వెనుక జలాలను బ్యాక్ వాటర్ ద్వారా మద్రాసు తాగునీటికి తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా అందజేయడంతో పాటు 29టీఎంసీల కృష్ణా జలాలను కర్నూలు, కడప జిల్లాల్లో అనేక గ్రామాలకు తాగునీరు, 2.75 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని కల్పించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగిందన్నారు. ఎన్టీఆర్ మానస పుత్రికగా పేర్కొంటున్న తెలుగంగ ప్రాజెక్టు నిర్మాణాలు నేటికీ అసంపూర్తిగానే ఉన్నాయని పేర్కొన్నారు.
తెలుగుగంగ ప్రాజెక్టు పరిధిలో ఉండే పలు మండలాల్లో ఉన్న చెరువుల పరిస్థితి దయనీయంగా ఉందని, ఈ చెరువుల కట్టలు బలహీనంగా ఉండడంతో, అధిక వర్షాలతో వరదలు సంభవిస్తే ప్రాణనష్టం, ఆస్తినష్టం జరుగుతుందన్న మనోవేదనలో ఈ ప్రాంత ప్రజలు ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో యన్.టి రామారావు ఆశయాలను నెరవేర్చే దిశగా తెలుగుగంగ ప్రాజెక్టు నిర్మాణాలను, పంట కాల్వలను తక్షణమే పూర్తి చేసి రాయలసీమ ప్రాంత రైతులకు బాసటగా నిలవాలని ప్రభుత్వాన్ని కోరారు. ధర్నా అనంతరం రుద్రవరం మండల తహసీల్దారు మల్లిఖార్జునరావుకు వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల రైతులు పాల్గొన్నారు.