ఈ నెల 31న విజయవాడ తూర్పులో ప్రత్యేక గ్రీవెన్స్
- జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
( విజయవాడ, ఆంధ్రప్రభ ) : ఈ నెల 31వ తేదీ శుక్రవారం విజయవాడ తూర్పు నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కార్యక్రమం పటమట ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూల్ సమీపంలోని నళ్లూరివారి కళ్యాణ మండపంలో జరుగుతుందన్నారు. ఈ ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని స్థానిక ప్రజల నుంచి అధికారులు అర్జీలను ఉదయం 10 గంటల నుంచి స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాస్థాయి అధికారులు పాల్గొంటారని ప్రజల సమస్యలకు సంబంధించిన అర్జీలను స్వీకరించి పరిష్కార చర్యలు చేపడతారని పేర్కొన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ లక్ష్మీశ కోరారు.
