గట్టుప్పలలో ఓటర్ సర్వేను పరిశీలించిన కలెక్టర్
గట్టుప్పల, ఆంధ్రప్రభ: మండల కేంద్రంలోని 194వ పోలింగ్ కేంద్రంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ సర్వే (ఎస్ఐఆర్)ను జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ బుధవారం ఆకస్మికంగా పరిశీలించారు. సర్వే నిర్వహణ తీరును పరిశీలించిన కలెక్టర్ బీఎల్ఓకు పలు సూచనలు చేశారు.
ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ప్రతి దరఖాస్తును నిబంధనల మేరకు పరిశీలించి, అర్హులైన ఓటర్ల వివరాలు తప్పకుండా నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రత్యేక సమగ్ర ఓటర్ సర్వేను పారదర్శకంగా, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని బీఎల్ఓను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీదేవి, తహశీల్దార్ రాములు, ఎంపీడీవో హిమబిందు, ఆర్ఐ శ్రీజన్, జూనియర్ అసిస్టెంట్లు నరసింహ, ఆంజనేయులు, జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
