క్లీన్ ఏలూరు జిల్లాగా తీర్చిదిద్దడంలో భాగస్వాములు కావాలి…

క్లీన్ ఏలూరు జిల్లాగా తీర్చిదిద్దడంలో భాగస్వాములు కావాలి…
జిల్లాలో సంపూర్ణ పారిశుద్ధ్య కార్యక్రమానికి 4 వారాలపాటు స్పెషల్ డ్రైవ్…
రోడ్లపై చెత్తలేకుండా పరిశుభ్రంగా ఉండాలి-రోడ్లపై పరిశుభ్రత స్పష్టంగా కనిపించాలి…
ఏలూరులో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) తో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి.
ఏలూరుబ్యూరో, ఆంధ్రప్రభ : రోడ్లపై పరిశుభ్రత స్పష్టంగా కనిపించేలా క్లీన్ ఏలూరు జిల్లాగా తీర్చిదిద్దడంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఏలూరులోని1వ డివిజన్లలోని కోడెల రోడ్డులో కమ్యూనిటీ హాలు వద్ద సంపూర్ణ పారిశుద్ధ్య కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి పరిసరాల పరిశుభ్రత గురించి కలెక్టర్, ఎమ్మెల్యే ప్రజలకు అవగాహన కలిగించారు.

కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ, ఆపరేషన్ కార్యక్రమాన్ని ఈనెల 22వ తేదీ నుండి జూన్ 20వ తేదీ వరకు నాలుగు వారాలు పాటు జిల్లాలో చేపట్టడం జరుగుతుందన్నారు. స్వర్ణఆంధ్ర- స్వచ్ఛఆంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో నాలుగు వారాలు పాటు ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో భాగంగా ఈనెల 22వ తేదీ నుండి జూన్ 20వ తేదీ వరకు నాలుగు వారాలపాటు పారిశుధ్య పనులు ముమ్మరంగా నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో పారిశుద్ధ్య పరిస్థితులను ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో మరింత మెరుగు పరిచేందుకు పరిసరాల్లో పేరుకు పోయిన చెత్తను తొలగించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

మొదటి వారం మే 22వ తేదీ నుండి 28వ తేదీ వరకు వారం రోజులు పాటు రెడ్, యెల్లో స్పాట్లు & రోడ్ల శుభ్రత కార్యక్రమం, 2వ వారంలో భాగంగా మే 29వ తేదీ నుండి జూన్ 4వ తేదీ వరకు వర్షపు నీటి కాలువలు, నల్లాలు పూడిక తీసి శుభ్రం చేయడం, వెనుక సందులు శుభ్రం, 3వవారంలో భాగంగా జూన్ 5వ తేదీ నుండి జూన్ 11వ తేదీ వరకు నివాస, వ్యాపార ప్రాంతాలలో భారీ వ్యర్ధాలు తొలగించడం,4వ వారంలో భాగంగా జూన్ 12వ తేదీ నుండి జూన్ 20వ తేదీ వరకు పబ్లిక్ టాయిలెట్లు & చెత్త హాట్ స్పాట్లు శుభ్రం చేసే కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు. అదేవిధంగా జిల్లాలో ప్రతీ నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం ద్వారా పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.
ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) మాట్లాడుతూ, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతతో రోగాలు దరిచేరవన్నారు. ఏలూరు నగరంలోని విలీన గ్రామాలలో సైతం సంపూర్ణ పారిశుద్ధ్య కార్యక్రమాలతోపాటు డ్రైన్లలో పూడికతీత చేపట్టి రోడ్లపై చెత్త లేకుండా చేస్తామన్నారు. రోడ్లపై చెత్త పేరుకుపోతే అపారిశుద్ద్యం, దోమలు ప్రబలి ప్రజలు అనారోగ్యాలకు గురవుతారన్నారు. ఇంటికి వచ్చే పారిశుద్ధ్య కార్మికులను పొడి చెత్త, తడి చెత్తలను విడివిడిగా అందించాలని, ప్రజలు రోడ్లపై చెత్త వేయకుండా తమ ఇంటికి వచ్చే చెత్తసేకరణ వాహనానికి అందించాలని, తమ ఇంటి పరిసరాలు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూడాలని బడేటి చంటి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఏలూరు ఇంచార్జ్ డిఆర్ఓ దేవకీదేవి,నగరపాలక సంస్థ కమీషనర్ ఏ.భానుప్రతాప్, కోఆప్షన్ సభ్యులు ఎస్.ఎం.ఆర్.పెదబాబు, ఆర్డీఓ కిషోర్, గృహ నిర్మాణ శాఖ పిడి సత్యనారాయణ, తహసీల్దార్ గాయత్రీదేవి పాల్గొన్నారు.


