మధ్యాహ్న భోజన పథకంపై ఆకస్మిక తనిఖీ…

మధ్యాహ్న భోజన పథకంపై ఆకస్మిక తనిఖీ…
విద్యార్థులతో కలిసి భోజనం చేసిన గద్దె అనురాధ
భవానిపురం, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ మంగళవారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం, కాలేశ్వరరావు మార్కెట్ సమీపంలోని గాంధీజీ మున్సిపల్ స్కూల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించిన ఆమె, ప్రతిరోజూ అందుతున్న భోజన మెనూ, నాణ్యత, రుచిపై వివరంగా ఆరా తీసి విద్యార్థుల సంక్షేమంపై తమ ప్రభుత్వ చిత్తశుద్ధిని మరోసారి చాటారు. విద్యార్థులకు స్వయంగా వడ్డించి, భోజనం రుచి గురించి తెలుసుకున్నారు.
అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేయడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రంలో విద్యా రంగంలో నాణ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. ముఖ్యంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా పరిశుభ్రత, పోషకాహారం, నాణ్యతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.

పాఠశాలలను స్వయంగా సందర్శిస్తూ భోజన నాణ్యతను పరిశీలించే విధానం వల్ల విద్యార్థులకు మెరుగైన ఆహారం అందడమే కాకుండా తల్లిదండ్రుల్లో ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతోందని పేర్కొన్నారు. స్కూల్లో అందించిన భోజనం రుచికరంగా, పరిశుభ్రంగా ఉండటంపై ఆమె సంతోషం వ్యక్తం చేస్తూ, వంట సిబ్బంది మరియు పాఠశాల సిబ్బందిని అభినందించారు. విద్యార్థుల ఆరోగ్యం, విద్య రెండింటినీ సమానంగా ప్రాముఖ్యతనిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. ప్రతి రోజూ మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని, వంటగది పరిశుభ్రతను కచ్చితంగా పాటించాలని, విద్యార్థుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని సిబ్బందికి సూచించారు.

తల్లిదండ్రులతో సమన్వయం పెంచుకోవాలని, ఇలాంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగిస్తూ ప్రభుత్వ పథకాల అమలు పారదర్శకంగా జరిగేలా కృషి చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో నాసిరకం బియ్యంతో భోజనం అందించగా, నారా చంద్రబాబు నెత్రుత్వంలోని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సన్న బియ్యంతో నాణ్యమైన భోజనం అందిస్తున్నదని పేర్కొన్నారు. భోజన నాణ్యత లోపించిన కారణంగా గత వైసీపీ పాలనలో విద్యార్థులు ఇంటి నుంచి భోజనం తెచ్చుకునే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిందని తెలిపారు.
ప్రస్తుతం అందుతున్న భోజనంపై విద్యార్థులు, తల్లిదండ్రులు సంతృప్తిగా ఉన్నారని, అందువల్లే విద్యార్థులంతా పాఠశాలలోనే భోజనం చేస్తున్నారని పేర్కొన్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించి పరిష్కార చర్యలు తీసుకుంటున్నారని, ప్రభుత్వ పథకాల అమలు మరింత మెరుగుపడేలా కృషి కొనసాగుతుందని గద్దె అనురాధ తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు షేక్ ఆషా, గొల్లపూడి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పాల మాధవ, స్కూల్ హెడ్ మాస్టర్ మల్లికార్జున రెడ్డి, పశ్చిమ నియోజవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు షేక్ నసీమా, ప్రధాన కార్యదర్శి పితాని పద్మ, 37 డివిజన్ అధ్యక్షులు మురళి, 37 డివిజన్ బూత్ కన్వీనర్ బోసు బాబు, 35 వ డివిజన్ అధ్యక్షురాలు షేక్ నందకుమారి, పశ్చిమ నియోజకవర్గం ఐటీడీపీ అధ్యక్షులు మధురాంతకం సాయి చైతన్య, తెలుగు మహిళలు కసింకోట మల్లేశ్వరి, పుప్పాల దుర్గ, పట్నాల భార్గవి, ప్రియాంక శాంతి, మెండు జ్యోతి, లంకా బుజ్జి గౌరీ, సయ్యద్ అలీ తదితరులు ఉన్నారు.
