మెట్ట ప్రాంత రైతులకు శాశ్వత సాగునీరు కల్పించాలి: వల్లభనేని వంశీ

  • వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ పునరుద్ధరణపై సీఎంకు కృతజ్ఞతలు
  • శాస్త్రీయ నీటి పంపిణీ విధానం రూపొందించాలని విజ్ఞప్తి
  • శాస్త్రీయ నీటి వినియోగ విధానం కోరిన వంశీ

విజయవాడ రూరల్ (వెస్ట్),ఆంధ్రప్రభ : పోలవరం కుడి ప్రధాన కాలువ నుంచి నీటిని ఎత్తిపోతల ద్వారా వినియోగిస్తున్న గన్నవరం నియోజకవర్గంలోని మెట్ట ప్రాంత వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ సరఫరాను ప్రభుత్వం పునరుద్ధరించడం పట్ల మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీ మోహన్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇదే సమయంలో, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం పోలవరం కుడి ప్రధాన కాలువ నుంచి నియంత్రిత ఎత్తిపోతల సాగుకు శాస్త్రీయ, సమగ్ర విధానాన్ని రూపొందించాలని కోరుతూ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. లేఖలో ఆయన పేర్కొన్న వివరాల ప్రకారం, గన్నవరం నియోజకవర్గంలోని మెట్ట గ్రామాల్లోని వ్యవసాయ భూములు పోలవరం కుడి ప్రధాన కాలువ నీటి మట్టానికి ఎత్తులో ఉండటంతో గురుత్వాకర్షణ పద్ధతిలో సాగునీరు అందించడం సాధ్యం కాదన్నారు. దీంతో వ్యవసాయ పంపుసెట్ల ద్వారా నీటిని ఎత్తిపోసుకోవడమే రైతులకు ఏకైక ప్రత్యామ్నాయమని వివరించారు.

విద్యుత్ సరఫరా పునరుద్ధరణతో వేలాది మంది రైతుల ఖరీఫ్ పంటలు నష్టపోకుండా కాపాడటంతో పాటు సాగునీటి సరఫరా నిరంతరంగా కొనసాగేందుకు అవకాశం లభించిందని పేర్కొన్నారు. ప్రతి సీజన్‌లో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా జలవనరులు, వ్యవసాయం, రెవెన్యూ, ఇంధన శాఖలు సమన్వయంతో సాంకేతిక అధ్యయనం నిర్వహించి శాశ్వత విధానాన్ని రూపొందించాలని వంశీ సూచించారు. అర్హులైన మెట్ట ప్రాంత ఆయకట్టును గుర్తించడం, పంపుసెట్ల ద్వారా నీటిని ఎత్తిపోసుకునేందుకు పారదర్శక నిబంధనలు రూపొందించడం, అందుబాటులో ఉన్న నీటి వనరులను శాస్త్రీయంగా కేటాయించడం, దిగువ ఆయకట్టు రైతుల హక్కులను పరిరక్షించడం, వార్షిక నీటి ప్రణాళికలో మెట్ట ప్రాంత అవసరాలను పొందుపరచడం వంటి అంశాలు ఆ విధానంలో ఉండాలని కోరారు.

ఈ విధంగా శాశ్వత సంస్థాగత విధానం అమల్లోకి వస్తే రైతులకు దీర్ఘకాలిక భరోసా కలుగుతుందని, నీటి నిర్వహణ మరింత పారదర్శకంగా సాగుతుందని, వివాదాలు తగ్గడంతో పాటు పోలవరం కుడి ప్రధాన కాలువ సాగునీటి ప్రయోజనాలు అర్హులైన ప్రతి రైతుకూ సమానంగా, శాస్త్రీయంగా, స్థిరంగా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.