పెద్దపల్లి బస్సు డిపో పనులను పరిశీలించిన ఆర్టీసీ ఎండీ

పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశం

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పెద్దపల్లి ఆర్టీసీ బస్సు డిపో నిర్మాణ పనులను తెలంగాణ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి గురువారం ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావుతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా డిపో నిర్మాణ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి డిపో సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.

నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టాలని గుత్తేదారుకు సూచించారు. పెద్దపల్లి బస్సు డిపో అందుబాటులోకి వస్తే ప్రజలకు ఆర్టీసీ సేవలు మరింత మెరుగ్గా అందుతాయని ఎండీ నాగిరెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో డీసీపీ రామ్‌రెడ్డి, ఏసీపీ కృష్ణ, సీఐ ప్రవీణ్ కుమార్, మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య, ఆర్టీసీ అధికారులు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.