గ్రామాల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే గండ్ర

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలి

టేకుమట్ల, ఆంధ్రప్రభ: గ్రామాల సమగ్ర అభివృద్ధి, ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సూచించారు.

బుధవారం టేకుమట్ల మండల కేంద్రంలోని ఎంఆర్సీ భవనంలో ఎంపీడీవో అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై వివిధ శాఖల పనితీరును సమీక్షించారు.

మండలంలోని గ్రామాల అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, మౌలిక వసతుల కల్పన, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం తదితర అంశాలపై శాఖల వారీగా అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు.

గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, అంతర్గత రహదారులు, విద్యుత్ సరఫరా, డ్రైనేజీ, వ్యవసాయానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.

సమావేశంలో సర్పంచులు తమ గ్రామాల్లోని తాగునీటి కొరత, రోడ్ల మరమ్మతులు, విద్యుత్ సమస్యలు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, డ్రైనేజీ, సాగునీరు, భూ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వాటిపై సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వ్యవసాయ శాఖ రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచడంతో పాటు సాంకేతిక సలహాలు అందించాలని, పశుసంవర్ధక శాఖ గ్రామీణ ప్రాంతాల్లో పశువైద్య సేవలను విస్తరించాలని సూచించారు. అలాగే ఆరోగ్య శాఖ గ్రామాల్లో వైద్య సేవలను మెరుగుపరచడంతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు తాగునీరు, మరుగుదొడ్లు, పరిశుభ్రత, మధ్యాహ్న భోజన పథకం అమలుపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, విద్యార్థుల హాజరు శాతం పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు.

ఇందిరమ్మ ఇళ్లు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతు సంక్షేమ పథకాలు, సామాజిక భద్రత పింఛన్లు తదితర సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా గ్రామస్థాయిలోనే సమస్యలను పరిష్కరించే విధంగా అధికారులు పనిచేయాలని సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఎంపీడీవో అజ్మీరా వసంత రామ్, తహసీల్దార్ స్వరూప, వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు పాల్గొన్నారు.