Miss World 2025| నేటి నుంచే మిస్ వ‌రల్డ్ పోటీలు … లాంచ‌నంగా ప్రారంభించ‌నున్న రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – ప్రపంచంలో అతి పెద్ద అందాల వేడుక అయిన మిస్ వరల్డ్ ఫెస్టివల్ -2025 హైద‌ర‌బాద్ వేదిక‌గా నేటి నుంచి ప్రారంభం కానుంది.. ఈ పోటీల‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి లాంచ‌నంగా ప్రారంభించ‌నున్నారు.. 109 దేశాలకు చెందిన అందాల భామలు పోటీల్లో పాల్గొననుండగా, మన దేశం నుంచి నందిని గుప్తా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ‘తెలంగాణ జరూర్​ ఆనా’ ట్యాగ్​లైన్​తో ఈ పోటీలు జరగనున్నాయి. వెయ్యి మందికిపైగా గెస్టులు, టాలీవుడ్‌, బాలీవుడ్‌ సెలబ్రిటీలు హాజరుకానున్నారు. మిస్​వరల్డ్​ ఓపెనింగ్​ సెర్మనీ అట్టహాసంగా నిర్వహించేందుకు పర్యాటక శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

గ‌చ్చిబౌలి, హైటెక్స్ వ‌ద్ద మూడంచ‌ల భ‌ద్ర‌త ..

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సర్కారు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. చీమ చిటుక్కుమన్నా తెలిసేలా పోలీసులు నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. మిస్‌ వరల్డ్‌ పోటీల్లో పాల్గొనేందుకు 109 దేశాలకు చెందిన సుందరీమణులు, ప్రతినిధులు రాష్ట్రానికి రావడంతో భద్రత విషయంలో ఏమాత్రం రాజీపడకుండా వ్యవహరిస్తున్నారు. దాదాపు 5వేల మందికి పైగా పోలీసులను ఈ పోటీల నిమిత్తం రంగంలోకి దించారు. వీరిలో అత్యధిక మంది సాయుధ పోలీసులే. పోటీల ప్రారంభ వేడుకలు జరిగే గచ్చిబౌలి స్టేడియంతోపాటు అతిథులు బస చేసి ఉన్న హోటళ్ల వద్ద షార్ప్‌ షూటర్లను, స్నైపర్లను మోహరించారు. ప్రపంచ సుందరి పోటీదారులకు హైదరాబాద్‌ హైటెక్‌సిటీలోని ఓ స్టార్‌ హోటల్‌లో బస ఏర్పాటు చేశారు. ఆ హోటల్‌తోపాటు ఆ ప్రాంతం మొత్తం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేశారు. హోటల్‌లో ఉండే సీసీ టీవీలు, ట్రాఫిక్‌ సీసీ కెమెరాలను అన్నింటినీ నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ఇక శనివారం గచ్చిబౌలి స్టేడియంలో పోటీల ప్రారంభ వేడుకలు నిర్వహించనున్న నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని పోలీసు బలగాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌, క్విక్‌ రియాక్షన్‌ టీ మ్స్‌ను ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్లతోపాటు వేదిక వద్ద మోహరిస్తున్నారు. మొత్తం మూడంచెల భద్రతావలయంలో పోటీలు జరుగుతాయని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.

హోటల్‌లో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌..

మిస్‌ వరల్డ్‌ పోటీల్లో పాల్గొనే పోటీదారులకు బస ఏర్పాటుచేసిన హోటల్‌లోనే పోలీసులు కూడా ‘‘మల్టీ ఏజెన్సీ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌’’ను ఏర్పాటు చేశారు. ఇందులో సివిల్‌ పోలీస్‌, ట్రాఫిక్‌, అగ్నిమాపక శాఖ, ఫుడ్‌ సేప్టీ, పోలీసు ఐటీ విభాగం సహా పలు విభాగాలు ఉన్నాయి. ప్రత్యేకంగా కొన్ని స్ర్కీన్‌లు ఏర్పాటుచేశారు. ఎప్పటికప్పుడు రోడ్లుపై ట్రాఫిక్‌తోపాటు, వేదిక వరకు వెళ్లే మార్గంతోపాటు, హోటల్‌ల్‌ పోటీదారులు ఉండే ఫ్లోర్‌లలోని సీసీ కెమెరాలను నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ఈ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో పోలీసు ఐటీ విభాగం కీలకంగా ఉండగా, దాదాపు 40 మంది వివిధ పనుల బాధ్యతలను చూస్తున్నారు. మరోవైపు హోటల్‌తో పాటు గచ్చిబౌలి ప్రాంతంలో డోన్లను వినియోగించేందుకు అవకాశం లేకుండా ‘‘నో డ్రోన్‌’’ జోన్‌గా ప్రకటించారు. హోటల్‌ దగ్గర మహిళా పోలీసులకే డ్యూటీలు వేశారు. హోటల్‌తో పాటు పరిసర ప్రాంతంలో కలిపి దాదాపు 2వేల మంది పోలీసులు డ్యూటీల్లో ఉండనున్నారు. ఆక్టోప్‌సలో రెండు టీమ్‌లను ఏర్పాటుచేశారు. డాగ్‌ స్వ్కాడ్‌ కూడా హోటల్‌ దగ్గర ఉంది. హోటల్‌ దగ్గర బందోబస్తును సైబరాబాద్‌ స్పెషల్‌బ్రాంచ్‌ డీసీపీ సాయిశ్రీ పర్యవేక్షిస్తున్నారు.

విదేశీ అందాల భామల పర్యాటక ప్రాంతాల సందర్శన
మిస్ వరల్డ్ పోటీల్లో ప్రపంచం నలుమూలల నుంచి తరలిరానున్న అందాల భామలు తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలైన చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్, రామప్ప, యాదగిరిగుట్ట దేవాలయాలతోపాటు నాగార్జున సాగర్, చేనేత చీరలు నేస్తున్న భూదాన్ పోచంపల్లి ప్రాంతాలను సందర్శించనున్నారు. ఈ సందర్భంగా అందాల రాణుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అందాల రాణులు తెలంగాణ పర్యాటక కేంద్రాలను సందర్శిస్తే, వీటిపై విదేశీ పర్యాటకుల దృష్టిని ఆకర్షించవచ్చని యోచిస్తున్నారు.

72వ మిస్ వరల్డ్ ఫెస్టివల్ కార్యక్రమాలు ఇవీ…

హైదరాబాద్ వేదికగా 72వ మిస్ వరల్డ్ ఫెస్టివల్ కార్యక్రమాలను ఈ నెల 10 తేదీ నుంచి జూన్ 2వతేదీవరకు వేర్వేరు వేదికలపై వేర్వేరు థీమ్ లతో చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. దేశ,విదేశాల నుంచి మిస్ వరల్డ్ ఫెస్టివల్ లో పాల్గొనేందుకు 109 దేశాల‌కు చెందిన సుంద‌రీమ‌ణులు హైదరాబాద్ కు చేరుకున్నారు. మే 10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ ప్రారంభ వేడుకలు ఏర్పాటు చేశారు. మే 12వతేదీన బుద్ధవనంలో అందాలభామలతో ఆధ్యాత్మిక పర్యటన ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా నాగార్జునసాగర్, హైదరాబాద్ లలో హెరిటేజ్ వాక్ ఏర్పాటు చేశారు.మే 13వతేదీన చౌమహల్లాప్యాలెస్ లో సుందరాంగులు, అతిథులకు వెల్ కం డిన్నర్ ఠఇవ్వాలని నిర్ణయించారు.

కాకతీయ హెరిటేజ్ టూర్

మే 14వతేదీన అందాల భామలతో కాకతీయ హెరిటేజ్ టూర్ ఉంటుంది. ఇందులో భాగంగా రామప్ప దేవాలయాన్ని సుందరాంగులు సందర్శించి, అక్కడి శిల్పకళను చూసి విద్యార్థులు, స్థానికులతో మాట్లాడనున్నారు. మే 15వతేదీన యాదగిరిగుట్టలోి దేవాలయాన్నిసందర్శించనున్నారు. అనంతరం పోచంపల్లి వీవర్స్ గ్రామాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత ఏఐజీ, అపోలో, యశోదా ఆసుపత్రులను అందాల భామలు సందర్శిస్తారని నిర్వాహకులు తెలిపారు. మే 17వతేదీన గచ్చిబౌల ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ స్పోర్ట్సుఫినాలే, కల్చరల్ ఈవెనింగ్ కార్యక్రమాలుంటాయి. అనంతరం ఎక్స్ పీరియం ఎకో టూరిజం పార్కులో తెలంగాణ కుషన్ ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు.

టీ హబ్ లో మిస్ వరల్డ్ పోటీదారుల ఎంపిక

టీ హబ్ లో మే 21వతేదీన మిస్ వరల్డ్ పోటీదారుల ఎంపిక కార్యక్రమం ఏర్పాటు చేశారు. మే19వతేదీన అందాల పోటీల్లో పాల్గొనే వారందరూ తెలంగాణ పోలీసు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, రాష్ట్రసచివాలయం, ట్యాంక్ బండ్, అంబేద్కర్ విగ్రహాలను సందర్శించనున్నారు.సుందరాంగులు మే 21వతేదీన శిల్పకళా వేదికపై ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ వర్కషాప్ లో పాల్గొంటారు.మే 22వతేదీన శిల్పకళావేదికపై మిస్ వరల్డ్ టాలెంట్ ఫినాలే ఉంటుంది. మే 23వతేదీన గచ్చిబౌలిలోని ఐఎస్ బీలో ఫినాలే రౌండ్స్ ఏర్పాటు చేశారు. మే 24వతేదీన హైదరాబాద్ హైటెక్స్ లో మిస్ వరల్డ్ టాప్ మోడల్ అండ్ ఫ్యాషన్ ఫినాలే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మే 25వతేదీన హైటెక్స్ లో ముత్యాల షోలో అందాల భామలు పాల్గొంటారు.

మే 31న హైటెక్స్ లో మిస్ వరల్డ్ ఫైనల్ సెర్మనీ

మే 31వతేదీన హైదరాబాద్ హైటెక్స్ లో మిస్ వరల్డ్ ఫైనల్ సెర్మనీ నిర్వహించాలని నిర్ణయించారు. మే 26వతేదీన బ్రిటీష్ రెసిడెన్సీ అయిన తాజ్ ఫలక్ నుమాలో గాలా డిన్నర్ కార్యక్రమం ఉంటుంది. జూన్ 2వతేదీన మిస్ వరల్డ్ విజేత తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుకుమార్ దేవ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని కలవనన్నారు.

అవుట్ డోర్ విజిట్ ర‌ద్దు చేసే అవ‌కాశం…

పాక్ , భార‌త్ మ‌ధ్య యుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొన్న త‌రుణంలో ఈ పోటీల‌లో పాల్గొనే ప్ర‌పంచ దేశాల సుంద‌రి మ‌ణుల ఔట్ డోర్ విజిట్ ను ర‌ద్దు చేయాల‌ని నిర్వాహ‌కులు భావిస్తున్నారు.. కేంద్రం కూడా ఈ మేర‌కు ఆదేశాలు జారీ చేసింది.. వివిధ దేశాల నుంచి వ‌చ్చే అతిథుల ర‌క్ష‌ణ విష‌యంలో రాజీ ప‌డొద్ద‌ల‌ని సూచించింది.. సాధ్య‌మైనంత వ‌ర‌కు ఇందులో పాల్గొనే భామాలు వారికి కేటాయించిన వ‌స‌తి గృహానికి, అలాగే పోటీలు జ‌రిగే ప్ర‌దేశానికి ప‌రిమితం చేయాల‌ని కూడా సూచించింది. అలాగే వారంద‌రికీ భ‌ద్ర‌త క‌ల్పించే విష‌యంలో సైన్యం స‌హాయం తీసుకోవాల‌సిందిగా రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వానికి ఆదేశించింది. ఈ నేప‌థ్యంలో ముందుగా అనుకున్న ప్రాంతాల సంద‌ర్శ‌న‌కు బ్రేక్ వేసే అలోచ‌న‌లో ప్ర‌భుత్వం ఉన్న‌ట్లు స‌మాచారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *