గ్రామీణ విద్యార్థులు ప్రతిభను నిరూపించాలి
ఆర్జీయూకేటీ ఓరియంటేషన్లో మాజీ డీజీపీ డాక్టర్ మహేందర్ రెడ్డి పిలుపు
బాసర, ఆంధ్రప్రభ: గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు తమ ప్రతిభకు పదును పెడితే సాధించలేనిది ఏదీ లేదని రాష్ట్ర మాజీ డీజీపీ, మాజీ టీఎస్పీఎస్సీ చైర్మన్ డాక్టర్ కె. మహేందర్ రెడ్డి అన్నారు.
శనివారం ఆర్జీయూకేటీ విశ్వవిద్యాలయంలో పీయూసీ నూతన విద్యార్థుల ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ మహేందర్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థుల్లో అపారమైన ప్రతిభ దాగి ఉంటుందని, ఆ ప్రతిభకు సరైన దిశ చూపిస్తే అద్భుతాలు సృష్టించవచ్చని అన్నారు. జీవితంలో ఉన్నత విజయాలను సాధించాలంటే నిరంతర అధ్యయనం, కఠిన క్రమశిక్షణ, సమయపాలన, సానుకూల దృక్పథం ఎంతో అవసరమని పేర్కొన్నారు.
కేవలం పాఠ్యపుస్తకాల జ్ఞానానికే పరిమితం కాకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా కమ్యూనికేషన్ నైపుణ్యాలు, భాషా ప్రావీణ్యం, సబ్జెక్టుపై లోతైన అవగాహన పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. ప్రతి అంశంపై జిజ్ఞాస, విమర్శనాత్మక ఆలోచనా విధానాన్ని అలవర్చుకుంటే విజయాన్ని సులభంగా చేరుకోవచ్చని చెప్పారు.
తన విద్యార్థి దశలో ఎదుర్కొన్న అనుభవాలు, కఠోర శ్రమ, పట్టుదల, నైతిక విలువలతో కూడిన జీవనశైలే తనను ఉన్నత స్థానానికి చేర్చాయని ఆయన గుర్తు చేసుకున్నారు. ప్రతి విద్యార్థి పెద్ద లక్ష్యాలు నిర్దేశించుకుని వాటి సాధన కోసం ప్రతిరోజూ ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని సూచించారు.
వేగంగా మారుతున్న సాంకేతిక యుగంలో నూతన పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉత్తమ వ్యక్తిత్వం, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని ఆయన విద్యార్థులకు సూచించారు.
విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ ఏ. గోవర్ధన్ మాట్లాడుతూ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, జీవన నైపుణ్యాలను పెంపొందించాలనే లక్ష్యంతో ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. డాక్టర్ మహేందర్ రెడ్డి వంటి విశిష్ట వ్యక్తుల అనుభవాలు విద్యార్థులకు స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు, డీన్లు, అధ్యాపకులు, పరిపాలనాధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
