Madakasira | టీడీపీ ఖాతాలో మడకశిర మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు
- రామగిరి ఎంపీపీ ఎన్నిక మళ్ళి వాయిదా
- ముగ్గురే హాజరు.. ఆరుగురు గైర్హాజరు
- కోరం లేక ముచ్చటగా మూడోసారి వాయిదా
శ్రీ సత్యసాయి బ్యూరో :శ్రీ సత్యసాయి జిల్లా (Sri Sathya Sai District) లో బుధవారం జరిగిన ఉప ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మడకశిర (Madakasira) మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కైవసం చేసుకుంది. అయితే రాప్తాడు నియోజకవర్గం రామగిరి (Ramagiri) మండల ఎంపీపీ ఎన్నిక మాత్రం ముచ్చటగా మూడవసారి వాయిదా పడింది.
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. చైర్మన్ గా 15వ వార్డు కౌన్సిలర్ నరసింహారాజు, వైస్ చైర్మన్ గా నాలుగో వార్డ్ కౌన్సిలర్ ప్రభావతి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి పెనుకొండ (Penukonda) ఆర్డీఓ ఆనంద్ కుమార్ తెలిపారు. కాగా మడకశిర మున్సిపాలిటీలో 20మంది కౌన్సిలర్లు ఉండగా టీడీపీ తరపున ఐదు మంది కౌన్సిలర్లు ఉండగా వైసీపీకి చెందిన 9మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరిపోయారు. దీంతో టీడీపీకి మద్దతు 14కు చేరింది. దీనికి తోడు ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు (MLA M.S.Raju) ఎక్స్ అఫిషియో సభ్యులు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు హాజరు కావడంతో మొత్తం 15కి చేరింది. కేవలం 6 మంది మాత్రం వైసిపి కౌన్సిలర్లు మిగిలారు. మున్సిపల్ ఎన్నికలను వైసీపీ కౌన్సిలర్లు ఆరుగురు బహిష్కరించారు.

రామగిరి ఎంపీపీ ఎన్నిక ముచ్చటగా మూడోసారి వాయిదా…
జిల్లాలో రామగిరి ఎంపీపీ ఎన్నిక ముచ్చటగా మూడోసారి వాయిదా పడింది. గతంలో రెండుసార్లు వాయిదా పడిగా మూడవసారి బుధవారం ఎంపీపీ ఎన్నికకు సంబంధించి సమావేశం ఏర్పాటుచేసి, ఎంపీటీసీలకు ఎన్నికల అధికారి నోటీసులు జారీ చేశారు. కానీ టీడీపీకి చెందిన ఒక ఎంపీటీసీ, వైసీపీ నుంచి టీడీపీకి మద్దతు తెలిపిన ఇరువురు ఎంపీటీసీలు మొత్తం ముగ్గురు ఎంపీటీసీలు మాత్రమే హాజరవుగా, వైకాపాకు చెందిన 6 మంది ఎంపీటీసీలు గైర్హాజరయ్యారు. దీంతో కోరం లేక ముచ్చటగా మూడవసారి రామగిరి ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది.
పోలీసుల భారీ బందోబస్తు…
ఉపఎన్నికల నేపథ్యంలో రామగిరి సంబంధించి ధర్మవరం డి.ఎస్.పి హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్ఎస్ గేట్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రామగిరి మండల కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారి కావడంతో ఎన్.ఎస్ గేట్ వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఇదే సందర్భంలో మడకశిర పట్టణంలో సైతం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
