ప్రముఖ సంఘ సేవకురాలు కనకరత్నం మృతి

ప్రముఖ సంఘ సేవకురాలు కనకరత్నం మృతి
సంతాపాలు వెల్లువ
పాయకాపురం, ఆంధ్రప్రభ : ప్రముఖ సంఘ సేవకురాలు, ఆధ్యాత్మికవేత్త తాళ్లూరి కనకరత్నం మంగళవారం ఉదయం కన్నుమూశారు. విజయవాడ కస్తూరిబాయిపేటలోని విజయాద్రి వెంకటేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధి కమిటీ సభ్యురాలిగా ఆమె సేవలందించారు.
గత 34 సంవత్సరాలుగా శ్రీరామ నవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడంలో కనకరత్నం కీలక పాత్ర పోషించారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా సమాజ సేవలో ఆమె ప్రత్యేక గుర్తింపు పొందారు.
కనకరత్నం తల్లిదండ్రులు స్వాతంత్ర్య సమరయోధులు చింతకాయల సత్యనారాయణ, బుల్లెమ్మ కాగా, ఆమె సోదరుడు కళాసేవకుడు, తెలుగు కళావాహిని అధ్యక్షుడు చింతకాయల చిట్టిబాబు. కనకరత్నం మృతి పట్ల కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ఆధ్యాత్మిక వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
జి.ఆర్.కె. పోలవరపు సాంస్కృతిక సమితి అధ్యక్షుడు గోళ్ళ నారాయణరావు, ఎక్స్-రే కార్యదర్శి బి. ఆంజనేయరాజు, గాయకుడు కె. డేవిడ్ రాజు, శ్రీ కళాభారతి అధ్యక్షుడు సింగంశెట్టి చంద్రశేఖర్ తదితరులు ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. కనకరత్నం ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
