20 రోజుల తేడాలో భార్యాభర్తల బలవన్మరణం

కరీంనగర్, ఆంధ్రప్రభ : పెళ్లి జరిగిన ఆరు రోజుల్లో భార్య బలవన్మరణానికి పాల్పడితే.. భార్య బలవన్మరణం చేసుకున్న 20 రోజుల్లో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో కలకలం సృష్టించింది. భార్యపై ఉన్న ప్రేమతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు తెలిపారు.
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండికి చెందిన అల్లెపు సంతోష్ (25), ఇంటి సమీపాన ఉన్న గంగోత్రి నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో సెప్టెంబరు 26న పెళ్లి చేసుకున్నారు. ఈ నెల 2న దసరా రోజు భార్యతో కలిసి అత్తింటికి వెళ్లిన సంతోష్ భోజన సమయంలో మటన్లో కారం ఎక్కువైందని భార్యను మందలించాడు.
దీంతో మనస్తాపం చెందిన ఆమె అదే రోజు రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమెపై ఉన్న ప్రేమతో అప్పటి నుంచి తీవ్ర మనోవేదనకు గురైన సంతోష్ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వారం రోజుల కిందట ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉండే అక్క వద్దకు వెళ్లిన సంతోష్ అక్కడే మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
