ఇస్లామాబాద్ – ఇండియాలో ఉగ్రదాడులకు పాల్పడి భారత్ చేతిలో చావుదెబ్బ తిన్న పాకిస్థాన్ మరో వివాదంలో చిక్కుకుంది. బంగ్లాదేశ్లో పాకిస్థాన్ హైకమిషనర్గా వ్యవహరిస్తున్న సయ్యద్ అహ్మద్ మరూఫ్ వివాదం లో చిక్కుకున్నాడు. ఓ బంగ్లాదేశీ అమ్మాయితో ప్రైవేటుగా గడిపిన ఆయన అశ్లీల వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే సయ్యద్ అహ్మద్ హనీట్రాప్లో చిక్కుకున్నారన్న వార్తలు గుప్పుమనడంతో పాకిస్థాన్ అప్రమత్తమైంది. ఆయనను సెలవుపై వెళ్లాల్సిందిగా ఆదేశించింది.
అయితే ఈ వివాదం బయటకు రాగానే అహ్మద్ మరూఫ్ మే 11న ఢాకా విడిచి వెళ్లిపోయినట్లు బంగ్లా మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆయన దుబాయ్ మీదుగా ఇస్తామాబాద్ చేరుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ విషయమై బంగ్లాదేశ్ విదేశాంగ శాఖకు పాకిస్థాన్ హై కమిషన్ అధికారికంగా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరూఫ్ స్థానంలో పాక్ డిప్యూటీ హైకమిషనర్ ఆసిఫ్ తాత్కాలికంగా హైకమిషనర్ బాధ్యతలు చేపట్టారు.
కాగా, మరూఫ్కు సంబంధించిన కొన్ని వీడియోలు ఇటీవల నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. ఓ బంగ్లాదేశీ యువతితో అతడు క్లోజ్ గా ఉన్న ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. ఆమెతో పాక్ దౌత్యవేత్తకు సన్నిహిత అనుబంధం ఉందని తెలుస్తుంది. ఆయన ఆ యువతి వలపు వలలో చిక్కుకున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.ఇప్పటికే సున్నితమైన నిఘా సమాచారాన్ని మరూఫ్ సదరు యువతికి చేరవేసి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పాకిస్థాన్ సమగ్ర విచారణకు ఆదేశించింది.