మిద్దె తోటలతో ఆరోగ్య మహాభాగ్యం..
మిద్దె తోటలతో పచ్చని ప్రగతి.. ఆరోగ్యకర భవిష్యత్
హరిత సమాజ నిర్మాణానికి సీటీజీ కృషి భేష్
జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
( విజయవాడ, ఆంధ్రప్రభ) : మిద్దె తోటలతో ఆరోగ్యకర హరిత సమాజ నిర్మాణం సాధ్య పడుతుందని.. ప్రతి కుటుంబం తమ ఇంటి మిద్దెపై కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలను పెంచే అలవాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పిలుపునిచ్చారు. మిద్దె తోటలు కుటుంబానికి తాజా, సురక్షితమైన పోషకాహారం అందించడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ (సీటీజీ)- విజయవాడ ఐదవ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి 450 మందికి పైగా సభ్యులు, గార్డెనింగ్ ఔత్సాహికులు, పర్యావరణ ప్రేమికులు హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ మాట్లాడుతూ సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ చేపడుతున్న హరిత కార్యక్రమాలను అభినందించారు. ప్రతి ఇంట్లో మిద్దె తోటలు ఏర్పాటు చేసుకుని సేంద్రీయ కూరగాయలను పండించడం ద్వారా కుటుంబాలకు ఆరోగ్యకరమైన ఆహారం అందుతుందని, పిల్లల్లో చిన్నప్పటి నుంచే మొక్కల పెంపకంపై ఆసక్తి పెంపొందించడం ద్వారా ప్రకృతి పట్ల బాధ్యతతో కూడిన భావనతో పాటు ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు బాటలు వేయవచ్చని పేర్కొన్నారు. హరిత సమాజ నిర్మాణానికి సీటీజీ చేస్తున్న కృషి ప్రశంసనీయమైనదని పేర్కొన్నారు.
వేదికపై వ్యర్థ వస్తువులతో రూపొందించిన ఆకర్షణీయమైన కళాకృతులను పరిశీలించిన కలెక్టర్ వాటిని రూపొందించిన హసీనాను ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాలలు, కళాశాలల్లో ఇటువంటి రీసైక్లింగ్ ఆధారిత సృజనాత్మక పోటీలను నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, పర్యావరణ స్పృహ, కళాత్మక నైపుణ్యాలను ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా వయోవృద్ధ గార్డెనర్లు, సీటీజీ సభ్యులు బలిజేపల్లి వేణుగోపాలరావు, వరలక్ష్మి దంపతులు, పగడాల సుభాష్ బాబు, ముత్యాల ఈశ్వరి దంపతులు, అబ్బూరి వెంకటేశ్వరరావు, విజయలక్ష్మి దంపతులు, యువ గార్డెనర్ కె. శ్రీనివాస్ తదితరులను సత్కరించారు. కార్యక్రమంలో సీటీజీ అడ్మిన్లు పీవీడీ నాగేశ్వరరావు, షేక్ అఫ్జల్ తదితరులు పాల్గొన్నారు.
