అమృత్ 2.0 పనులకు శ్రీకారం..

  • విలీన గ్రామాలకు గోదావరి తాగునీరు..
  • ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించడమే లక్ష్యం
  • ఎమ్మెల్యే బడేటి చంటి

ఏలూరు, ఆంధ్రప్రభ : ఏలూరు నగరంలో విలీనమైన గ్రామాల ప్రజలకు గోదావరి జలాలను త్రాగునీరుగా అందించే బృహత్తర కార్యక్రమానికి పటిష్టవంతమైన అడుగులు ఎంతో సమర్థవంతంగా పడుతున్నాయని ఎంపీ మహేష్‌ యాదవ్, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైన కోట్లాది రూపాయల నిధులను రాబట్టడం దగ్గర్నుంచి పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తిచేసేంత వరకూ ఎంతో ప్రణాళికాయుతంగా ముందుకెళ్తున్నామని వారు వెల్లడించారు. ఏలూరు నగరంలో విలీనమైన ఏడు గ్రామాల త్రాగునీటి కల సాకారానికి కూటమి ప్రభుత్వం విశేషంగా కృషిచేస్తోంది.

ఇందుకు అవసరమైన పునాదులను బలీయంగా వేస్తూ వచ్చింది మాత్రం ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి. విలీన గ్రామాల్లోని ప్రతి ఇంటికీ సురక్షిత త్రాగునీరు అందించాలనే లక్ష్యానికి పటిష్ట బాటలు పరుస్తూ వచ్చారాయన. ఈక్రమంలో సోమవారం ఏలూరు 27వ డివిజన్‌ చొదిమెళ్ళలో అమృత్‌ 2.0 పథకంలో భాగంగా రక్షిత గోదావరి జలాల సరఫరాకు తొలి అడుగులు పడ్డాయి.

ఈ పథకంలో భాగంగా కోటి 65లక్షల రూపాయల వ్యయంతో 5లక్షల లీటర్ల సామర్ధ్యం కలిగిన నీటి నిల్వ ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌ నిర్మాణానికి ఏలూరు ఎంపి పుట్టా మహేష్‌ కుమార్‌, టీడీపీ జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఆర్టీసి విజయవాడ జోన్‌ – 2 చైర్మన్‌ రెడ్డి అప్పలనాయుడు, బీజేపి జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్‌కిషోర్‌ తదితరులు శంకుస్థాపన చేశారు. అలాగే శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తొలుత కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన వారికి ఆత్మీయ స్వాగతం లభించింది.

అనంతరం నిర్వహించిన సభలో ఎంపీ మహేష్‌ యాదవ్ మాట్లాడుతూ, అభివృద్ధే కూటమి ప్రభుత్వ అజెండా అని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆగిపోయిన అభివృద్ధిని సైతం ఎంతో పారదర్శకంగా ముందుకు తీసుకెళ్తోన్న విధానాన్ని ఆయన వివరించారు. ఇదేసమయంలో ప్రజల అవసరాలు తీర్చేందుకు ఎమ్మెల్యే చంటి కోరిన వెంటనే రహదారితో పాటూ బోరుకు అవసరమైన 57లక్షల రూపాయల ఎంపీ నిధులను మంజూరు చేస్తున్నట్లు ఆయన అక్కడికక్కడే ప్రకటించారు. అలాగే ఏలూరు పార్లమెంట్‌ పరిధిలో సుమారు 13వందల కోట్ల రూపాయల నిధులతో 12 ఆర్వోబీల నిర్మాణ పనులు శరవేగంగా జరుగు తున్నాయని ఆయన వెల్లడించారు.

ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ, విలీన గ్రామాల్లోని ప్రతి ఇంటికి సురక్షిత త్రాగునీరు అందించే లక్ష్యంతో పరిశ్రమిస్తున్నామని చెప్పారు. దానిలో భాగంగానే 299 కోట్ల, 37 లక్షల రూపాయల అమృత్ 2.0 నిధులతో భారీ నీటి ప్రాజెక్టులు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. ఇవే నిధులతో డ్రైనేజీల నిర్మాణానికి చేపట్టిన చర్యలను కూడా ఎమ్మెల్యే విపులీకరించారు. ఇదేసమయంలో పలు పనులకు నిధులు మంజూరు చేయాలని ఎంపీ పుట్టాను ఎమ్మెల్యే చంటి కోరారు.

కూటమి ప్రభుత్వ రెండేళ్ళ పాలనా కాలంలో జరిగిన అభివృద్ధిని సవివరంగా తెలిపిన ఎమ్మెల్యే చంటి, విలీన గ్రామాల్లోని ప్రజల ప్రయోజనాలకు అగ్రతాంబూలం వేస్తున్నట్లు పునరుద్ఘాటించారు. ఆర్టీసి విజయవాడ జోన్‌ – 2 చైర్మన్‌ రెడ్డి అప్పలనాయుడు, బీజేపి జిల్లా అధ్యక్షులు విక్రమ్‌ కిషోర్‌లు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వాధినేతలు చేస్తోన్న కృషిని వివరించారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు మీరావలీ, ఏఎంసి చైర్మన్‌ మామిళ్ళపల్లి పార్ధసారధి, ఈడా చైర్మన్‌ పెద్దిబోయిన శివప్రసాద్‌, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకట రత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, వివిధ హోదాలలో ఉన్న కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.