విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత
విద్యార్థులకు ఉచిత షూ, సాక్స్ పంపిణీ
ఊట్కూర్, ఆంధ్రప్రభ: విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తోందని ఊట్కూర్ మండల విద్యాశాఖ అధికారి (ఎంఈవో) మాధవి అన్నారు. శనివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ ఎంఆర్సీ కార్యాలయం వద్ద విద్యార్థులకు ఉచితంగా షూ, సాక్స్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎంఈవో మాధవి మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు.
షూ, సాక్స్ అందుబాటులో ఉండటం వల్ల విద్యార్థులు పాఠశాలకు మరింత సౌకర్యవంతంగా, క్రమశిక్షణతో హాజరుకావడంతో పాటు పరిశుభ్రత, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి సమాన అవకాశాలు, మెరుగైన విద్యా వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యార్థుల సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన, గుణాత్మక విద్య అందుతున్నదని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు కుసుమ, ప్రధానోపాధ్యాయులు సలాం, శివరాజ్, బాలు, గులాం రసూల్, ఆనంద్, హాజీ బాబా, ఉపాధ్యాయులు అయూబ్, భాస్కర్, గోవర్ధన్, ఎంఐఎస్ సరస్వతి తదితరులు పాల్గొన్నారు.
