పేరూరు జెడ్పిహెచ్ఎస్ డైమండ్ జూబ్లీకి ఊరంతా ఒక్కటే స్వరం…

పేరూరు జెడ్పిహెచ్ఎస్ డైమండ్ జూబ్లీకి ఊరంతా ఒక్కటే స్వరం…
కౌకుంట్ల, ఆంధ్రప్రభ : కౌకుంట్ల మండలం పేరూరు జెడ్పి హెచ్ఎస్ పాఠశాల 75 సంవత్సరాల డైమండ్ జూబ్లీ వేడుకలకు గ్రామాలన్నీ ఒకే వేదికపైకి వస్తున్నాయి. ఈ వేడుకల నిర్వహణకు సంబంధించి మార్చి 15వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తుది ఆర్గనైజింగ్ కమిటీ సమావేశం జరగనుంది. అనంతరం సాయంత్రం 4 గంటలకు గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.
పేరూరు గ్రామంతో పాటు వెంకంపల్లి, వెంకటగిరి, రేకులంపల్లి, వర్ణే, ముత్యాలంపల్లి, కన్మనూరు గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఈ సమావేశంలో పాల్గొని డైమండ్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై చర్చించనున్నారు.
ఇక పాఠశాల చరిత్రను శాశ్వతంగా భద్రపరచడానికి జెడ్పిహెచ్ఎస్ పేరూర్ 1950 పేరుతో ప్రత్యేక యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించారు. ఈ ఛానల్ ద్వారా పాఠశాలకు సంబంధించిన సమాచారం, కార్యక్రమాలు అందుబాటులో ఉండనున్నాయి. ఏప్రిల్ 19 (ఆదివారం) జరగనున్న 75 వసంతాల డైమండ్ జూబ్లీ వేడుకలను లైవ్ ప్రసారం చేసే అవకాశముందని నిర్వాహకులు తెలిపారు.
భవిష్యత్తులో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాలు, పాఠశాలలో జరిగే వివిధ కార్యక్రమాల వీడియోలను కూడా ఈ ఛానల్లో అప్లోడ్ చేయనున్నారు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న పూర్వ విద్యార్థులు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని తమ పాఠశాలకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం కలుగుతుందని నిర్వాహకులు వెల్లడించారు.
