ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్

ఉమ్మడి వరంగల్ బ్యూరో (ఆంధ్రప్రభ): నెలవారీ తనిఖీల్లో భాగంగా హనుమకొండలోని రెడ్‌క్రాస్ భవనం వెనుక ఉన్న ఈవీఎం గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్‌పాయ్ బుధవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా గోడౌన్‌లోని స్ట్రాంగ్‌రూమ్ సీళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేసిన కలెక్టర్, ఈవీఎం గోడౌన్ భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా భద్రతా సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. షిఫ్టుల వారీగా కేటాయించిన విధులను సమయపాలనతో నిర్వర్తిస్తూ, గోడౌన్ భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని సూచించారు.

గోడౌన్ నిర్వహణకు సంబంధించిన రికార్డులు, భద్రతా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అన్ని నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ తనిఖీలో ఎన్నికల విభాగం పర్యవేక్షకులు జగత్ సింగ్‌తో పాటు సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.