జైలు భరోను విజయవంతం చేయాలి
కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు, రైతులు తరలిరావాలి: సీఐటీయూ
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 10న నిర్వహించే జైలు భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి జి. జ్యోతి పిలుపునిచ్చారు.
మంగళవారం పెద్దపల్లి కాలేజీ గ్రౌండ్లో జైలు భరో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించి ఆమె మాట్లాడారు. కార్మికులకు నష్టం చేసే నాలుగు లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే విద్యుత్ సవరణ చట్టం-2025ను ఉపసంహరించుకోవాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై గ్రామాలు, పట్టణాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు.
ఈ నెల 10న జరిగే జైలు భరో కార్యక్రమంలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎస్. వెంకటస్వామి, బొంకూరు సాగర్, రాజయ్య, చింతల మరియ, అన్వేష్, దేవమ్మ, కనకలక్ష్మి, కొండయ్య తదితరులు పాల్గొన్నారు.
