వరద ప్రభావిత రాష్ట్రాలకు అండ‌గా కేంద్రం

  • కేంద్రం రూ.2,117.85 కోట్ల ముందస్తు సాయం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దక్షిణ పశ్చిమ రుతుపవనాల సందర్భంగా వరదలతో ప్రభావితమైన రాష్ట్రాలకు సహాయక చర్యలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విపత్తు స్పందన నిధి (SDRF) కింద రూ.2,117.85 కోట్ల కేంద్ర వాటాను ముందస్తుగా విడుదల చేయడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆమోదం తెలిపారు.

ఈ ఏడు రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, నాగాలాండ్ రాష్ట్రాలు ఇప్పటికే 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత SDRF నిధులను అందుకున్నాయి.

ముందస్తుగా విడుదల చేసిన నిధుల్లో అరుణాచల్ ప్రదేశ్‌కు తొలి విడతగా రూ.44.55 కోట్లు, అస్సాంకు రూ.379.35 కోట్లు, గుజరాత్‌కు రూ.500 కోట్లు మంజూరు చేశారు. ఇప్పటికే తొలి విడత నిధులు పొందిన హిమాచల్ ప్రదేశ్‌కు రెండో విడతగా రూ.193.95 కోట్లు, ఒడిశాకు రెండో విడతగా రూ.500 కోట్లు మంజూరు చేశారు. మహారాష్ట్రకు తొలి విడతగా రూ.500 కోట్లు విడుదలకు ఆమోదం లభించింది.

దక్షిణ పశ్చిమ రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి వరద పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని కేంద్ర హోంశాఖ తెలిపింది. అవసరమైన చోట జాతీయ విపత్తు స్పందన దళం (NDRF) బృందాలను ముందస్తుగా మోహరించడంతో పాటు, రక్షణ మంత్రిత్వ శాఖ ద్వారా అవసరమైన లాజిస్టిక్ సహాయాన్ని కూడా అందిస్తున్నట్లు పేర్కొంది.

అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలో నష్టాలను అంచనా వేయడానికి ఇప్పటికే అంతర్ మంత్రిత్వ శాఖ కేంద్ర బృందాలు (IMCTలు) పర్యటిస్తున్నాయని, నాగాలాండ్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఆ రాష్ట్రానికి కూడా ఒక IMCTను ఏర్పాటు చేస్తున్నట్లు హోంశాఖ వెల్లడించింది.

వరద ప్రభావిత రాష్ట్రాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు, పునరావాస కార్యక్రమాలను మరింత బలోపేతం చేయడమే ఈ ముందస్తు నిధుల విడుదల ప్రధాన ఉద్దేశమని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది.