సైబర్ మోసగాళ్ల కొత్త ఎత్తుగడ.. జిల్లా జడ్జి పేరుతో.. !
మచిలీపట్నం, ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా ప్రధాన జిల్లా మరియు సెషన్స్ న్యాయమూర్తి, మచిలీపట్నం వారి పేరుతో తప్పుడు గుర్తింపును సృష్టించి సైబర్ మోసానికి పాల్పడేందుకు జరిగిన ప్రయత్నంపై జిల్లా న్యాయవ్యవస్థ ప్రజలను అప్రమత్తం చేసింది.
ఆగస్టు 1, 2026న కొంతమంది న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి గుర్తు తెలియని వ్యక్తి వాట్సాప్ ద్వారా సందేశాలు పంపాడు. ప్రధాన జిల్లా మరియు సెషన్స్ న్యాయమూర్తి ఫొటోను వాట్సాప్ డిస్ప్లే పిక్చర్గా ఉపయోగించి, తానే గౌరవనీయ న్యాయమూర్తినని తప్పుడు విధంగా పరిచయం చేసుకున్నాడు. అనంతరం తన బ్యాంకు ఖాతాలోకి నగదు బదిలీ చేయాలని సందేశాల ద్వారా కోరాడు.
ఈ విషయంపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, సైబర్ క్రైమ్ అధికారుల సమన్వయంతో దర్యాప్తు చేపట్టాలని కోరుతూ మచిలీపట్నంలోని చిలకలపూడి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేశారు.
ఏ న్యాయమూర్తి గానీ, న్యాయాధికారి గానీ వాట్సాప్ లేదా ఇతర అనధికారిక కమ్యూనికేషన్ మాధ్యమాల ద్వారా నగదు బదిలీ చేయాలని ఎప్పుడూ కోరరని జిల్లా న్యాయవ్యవస్థ స్పష్టం చేసింది.
ప్రజలు ఇటువంటి అనుమానాస్పద సందేశాలకు స్పందించకుండా, ఎలాంటి నగదును బదిలీ చేయకుండా, ఓటీపీలు, పిన్లు, పాస్వర్డ్లు లేదా బ్యాంకు ఖాతా వివరాలను ఎవరికీ వెల్లడించకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇటువంటి అనుమానాస్పద సందేశాలు లేదా కమ్యూనికేషన్లు అందినట్లయితే, వెంటనే పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ అధికారులకు సమాచారం అందించాలని జిల్లా న్యాయవ్యవస్థ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
