ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరేయాలి: బీజేపీ పిలుపు

హర్ ఘర్ తిరంగ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేతల పిలుపు

నాగర్‌కర్నూల్, ఆంధ్రప్రభ: ఆగస్టు 15న నిర్వహించనున్న ‘హర్ ఘర్ తిరంగ’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని బీజేపీ రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు.

బుధవారం నాగర్‌కర్నూల్‌లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు వేముల నరేందర్‌రావు అధ్యక్షతన జిల్లా పదాధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతంరావు, ‘హర్ ఘర్ తిరంగ’ రాష్ట్ర కో-కన్వీనర్ కట్ట సుధాకర్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, రాష్ట్ర అధికార ప్రతినిధి సోలంకి శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ‘హర్ ఘర్ తిరంగ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అలాగే పోలింగ్ బూత్‌లతో సమన్వయం చేసుకుంటూ ఓటర్ల ప్రత్యేక సవరణ జాబితా కార్యక్రమంలో పార్టీ శ్రేణులు చురుకుగా పాల్గొనాలని సూచించారు.

ప్రజా సమస్యలపై అన్ని మోర్చాలు సమన్వయంతో నిరంతరం పోరాటాలు నిర్వహించాలని నాయకులు పిలుపునిచ్చారు. సమావేశంలో వివిధ మోర్చాలకు నూతనంగా నియమితులైన జిల్లా అధ్యక్షులను సన్మానించారు.

కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శులు నాగేందర్ గౌడ్, శ్రీధర్‌రెడ్డి, నరసింహ, రాష్ట్ర, జిల్లా పదాధికారులు, వివిధ మోర్చాల రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, మండల ఇంచార్జులు పాల్గొన్నారు.