స్థానిక సంస్థల్లో బీసీలకు జనాభా నిష్పత్తి మేర రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి
స్థానిక సంస్థల్లో బీసీలకు జనాభా నిష్పత్తి మేర రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి
ప్రత్యేక కమిషన్ చైర్మన్కు వినతిపత్రం సమర్పించిన ఘంటా పద్మశ్రీప్రసాద్
ఏలూరు బ్యూరో, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతులకు (బీసీలు) వారి జనాభా నిష్పత్తికి అనుగుణంగా రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీప్రసాద్ కోరారు.
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం చేస్తున్న ప్రత్యేక కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాకు గురువారం ఆమె వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఘంటా పద్మశ్రీప్రసాద్ మాట్లాడుతూ, రాష్ట్ర జనాభాలో బీసీలు గణనీయమైన శాతం కలిగి ఉండటమే కాకుండా వ్యవసాయం, సంప్రదాయ వృత్తులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, వ్యాపారం, సేవారంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ రాజకీయ, సామాజిక రంగాల్లో తగిన ప్రాతినిధ్యం పొందలేకపోతున్నారని పేర్కొన్నారు.
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి సుప్రీంకోర్టు నిర్దేశించిన “ట్రిపుల్ టెస్ట్” ప్రక్రియను కేవలం విధానపరమైన అంశంగా కాకుండా, బీసీల సామాజిక న్యాయం, రాజకీయ సాధికారతను బలోపేతం చేసే సాధనంగా ఉపయోగించాలని సూచించారు.
కమిషన్ పరిశీలన కోసం పలు సూచనలను ఆమె ప్రతిపాదించారు. బీసీల జనాభా శాతానికి అనుగుణంగా స్థానిక సంస్థల్లో రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. ఇందుకోసం శాస్త్రీయ డేటాతో పాటు సామాజిక, విద్యా, ఆర్థిక, రాజకీయ వెనుకబాటుతనాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
జిల్లాల వారీగా, స్థానిక సంస్థల వారీగా బీసీ వర్గాలపై సమగ్ర అధ్యయనం నిర్వహించి, జనాభాతో పాటు విద్యా స్థితి, ఆర్థిక పరిస్థితులు, సంప్రదాయ వృత్తులు, అవకాశాల ప్రాప్తి, వాస్తవ రాజకీయ ప్రాతినిధ్యాన్ని పరిశీలించాలని కోరారు.
సామాజిక, విద్యా వెనుకబాటుతనంతో పాటు రాజకీయ ప్రాతినిధ్యం లోపాన్ని కూడా ప్రత్యేక ప్రమాణంగా పరిగణించాలని, బీసీలకు తగిన అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు, కమిటీలు, ఇతర ప్రజా సంస్థల్లో ఎన్నికైన, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు సముచిత వాటా కల్పించేలా కమిషన్ సిఫార్సులు చేయాలని కోరారు.
రాజకీయ అవకాశాలకు ఇంకా దూరంగా ఉన్న అత్యంత వెనుకబడిన బీసీ ఉపవర్గాలను గుర్తించి, వారికి ప్రత్యేక అవకాశాలు కల్పించే చర్యలను సూచించాలని అభ్యర్థించారు. అలాగే బీసీ మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని పెంపొందించే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు.
బీసీ వర్గాలకు సంబంధించిన ఖచ్చితమైన, శాస్త్రీయ, పారదర్శక డేటా ఆధారంగా నివేదిక రూపొందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, రాజకీయ సాధికారత లక్ష్యాల సాధనకు అనుగుణంగా కమిషన్ సిఫార్సులు ఉండాలని కోరారు.
రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాలు, ప్రజాప్రతినిధులు, సామాజిక సంస్థల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని సమగ్ర నివేదిక రూపొందించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్లో బీసీలకు జనాభా నిష్పత్తి మేర రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా సామాజిక న్యాయం బలోపేతం అవుతుందని, స్థానిక స్వపరిపాలన వ్యవస్థలు మరింత ప్రజాస్వామ్యబద్ధంగా మారుతాయని ఘంటా పద్మశ్రీప్రసాద్ పేర్కొన్నారు.
