తమది ప్రజా ప్రభుత్వం అని ప్రచారం చేసే భట్టి విక్రమార్క.. బకాయిలు చెల్లించాలని కాంట్రాక్టర్లు సచివాలయానికి వస్తే పోలీసులను అడ్డు పెట్టుకుని వెనుక గేటు గుండా ఎందుకు వెళ్లిపోయారని… ఎందుకు ముఖం చాటేశారని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు.
తమ పెండింగ్ బిల్లులపై సర్పంచ్ లు రోడ్డెక్కినా కాంగ్రెస్ ప్రభుత్వం కరుణించడం లేదని.. కమీషన్లకు ఆశపడి మంత్రులు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్న వైనం కాంట్రాక్టర్ల సచివాలయంలో చేసిన ఆందోళనతో నిరూపితమైందన్నారు.
పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 6వేల కోట్ల రూపాయలు బాకీ పడిందని అన్నారు. చెప్పులు అరిగేలా తిరుగుతున్నా ఆ బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని వ్యాఖ్యానించారు.
కాంట్రాక్టర్ల తరహాలోనే ఉద్యోగులు కూడా తమ బకాయిలు తాము పొందేందుకు కమిషన్లు ఇవ్వాల్సిందేనా? అని ప్రశ్నించారు హరీశ్ రావు. బకాయిలు చెల్లించాలంటూ కొందరు సెల్ఫీలు తీసి వీడియోలు పెడితేనో, కోర్టులకు వెళ్తేనో ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తున్నారు తప్ప… నిబంధనల ప్రకారం రావాల్సిన వాటిని కూడా పెండింగ్ లో పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఢిల్లీలో తమ బాస్ లకు కప్పం కట్టేందుకు అన్ని వర్గాల నుంచి మంత్రులు లంచాలు తీసుకుంటున్నారని లోకం కోడై కూస్తోందన్నారు. కాంట్రాక్టర్లు ఈ రోజు సచివాలయంలోని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఛాంబర్ ముందు చేసిన ధర్నా ఆ లంచాల ఆరోపణలు నిజమే అని నిరూపించిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే స్కాములు, కమిషన్ల ప్రభుత్వమని మరోసారి రుజువు అయిందని హరీశ్ రావు అన్నారు. 20% కమిషన్ తీసుకుంటున్నారంటూ కాంట్రాక్టర్లే స్వయంగా సచివాలయానికి వచ్చి ధర్నా చేయడం గతంలో కనీ విని ఎరుగని ఘటన… ఇది తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టకు మాయని మచ్చ.
రాహుల్ గాంధీ తాను చెప్పే నీతి సూత్రాలపై ఏమాత్రం నమ్మకం ఉన్నా… తక్షణమే సచివాలయంలో కాంట్రాక్టర్లు మంత్రులపై చేసిన అవినీతి ఆరోపణలపై స్పందించాలన్నారు హరీశ్ రావు. కాంట్రాక్టర్లు చేస్తున్న తీవ్రమైన అవినీతి ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు సుమోటోగా స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని ఎండగట్టేందుకు బీఆర్ఎస్ శక్తివంచన లేకుండా పోరాడుతుందని పేర్కొన్నారు. బడా కాంట్రాక్టర్లకు కమీషన్లు తీసుకుని బిల్లులు చెల్లిస్తూ చిన్న కాంట్రాక్టర్లకు, మాజీ సర్పంచ్ లకు, ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను ఆపడం అన్యాయం అని… ప్రతి వేదిక మీద కాంగ్రెస్ అవినీతిని సాక్ష్యాధారాలతో సహా నిరూపించి బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తాం అని తెలిపారు.
కేసీఆర్ హయాంలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దిన ‘మన ఊరు మన బడి’ కార్యక్రమం కింద చేపట్టిన పనులకు ఇప్పటి వరకు బిల్లులు చెల్లించకపోవడం అమానుషం.. తక్షణమే పెండింగ్ బిల్లులను విడుదల చేయాలి. పదిహేను నెలల కాంగ్రెస్ పాలనలో ఆర్థిక శాఖ నుంచి జరిగిన అన్ని చెల్లింపులపై శ్వేత పత్రం విడుదల చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.