Kadiyam Srihari | ఘన్పూర్ గడ్డపై మళ్లీ వేడేక్కిన రాజకీయం
- మా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియంకు స్వాగతం అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు
- ఫ్లెక్సీ తొలగింపుకు మున్సిపల్ సిబ్బంది, పోలీసుల ప్రయత్నం
- గులాబీ శ్రేణుల అడ్డుకోవడంతో ఉద్రిక్తత
- బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్
Kadiyam Srihari | స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన కడియం శ్రీహరి, అనంతరం కాంగ్రెస్ పార్టీలో (Congress Party) చేరిన విషయం తెలిసిందే. నిన్నటి రోజున స్పీకర్ కు అఫిడవిట్ ద్వారా తాను బిఆర్ఎస్ లో ఉన్నానని తెలియచేశారు. దీంతో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. తమ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియంకు స్వాగతం అంటూ బీఆర్ఎస్ శ్రేణులు శనివారం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ తీవ్ర వివాదానికి దారితీసింది.

ఫ్లెక్సీని తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది, పోలీసులు (Police) రంగంలోకి దిగగా, దీనికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గట్టిగా అడ్డుకున్నారు. ఫ్లెక్సీ తొలగింపును నిరసిస్తూ గులాబీ శ్రేణులు నినాదాలు చేయడంతో క్షణాల్లోనే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు జోక్యం చేసు కొని పరిస్థితి అదుపు తప్పకుండా చూసేందుకు బీఆర్ఎస్ నాయ కులను అరెస్ట్ చేశారు.

- బీఆర్ఎస్ గుర్తింపు వాడటం సరికాదు: బీఆర్ఎస్ నాయకులు
పార్టీ మారిన తరువాత కూడా బీఆర్ఎస్ గుర్తింపు వాడటం సరికాదని, ఇది రాజకీయ నైతికతకు విరుద్ధమని అరెస్ట్ అయిన అనంతరం పలువురు బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను సహించబోమని, పార్టీ మారిన కడియం స్పష్టమైన రాజకీయ వైఖరితో ప్రజల ముందుకు రావాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ (BRS) కార్యకర్తల కష్టంతో గెలిచిన కడియం శ్రీహరి అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయాన్ని బహిరంగంగానే ప్రకటించారని ఈ సందర్బంగా గుర్తు చేశారు.

అయితే తాజాగా తాను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నానని స్పీకర్కు (Speaker) అఫిడవిట్ ఇవ్వడం రాజకీయంగా తప్పుదోవ పట్టించే చర్యగా వారు అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. దమ్ముంటే బహిరంగంగా బీఆర్ఎస్ కండువా కప్పు కుని నియోజకవర్గంలో తిరగాలని సవాల్ విసిరారు. మున్సిపల్ కమిషనర్ పార్టీ ఏజెంట్లా వ్యవహరిస్తూ ఫ్లెక్సీ తొలగించారని ఆరోపించారు. అధికారులు రాజకీయాలకు దూరంగా ఉండి, స్థానిక సమస్యలపై దృష్టి పెట్టాలని హెచ్చరించారు. వెంటనే కడియం బద్ధి తెచ్చుకోవాలి..ఇకపై ఇలాంటి చర్యలు కొనసాగితే తెలంగాణ ఉద్యమాన్ని తలపించే రీతిలో గ్రామ గ్రామాన కడియంను తరిమికొడతామని బీఆర్ఎస్ శ్రేణులు హెచ్చరించారు.

