బీజేపీ జనగామ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా వల్లపు తిరుమల్ ప్రసాద్

పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానని స్పష్టం

రఘునాథపల్లి, ఆంధ్రప్రభ: రఘునాథపల్లి మండలం గబ్బెట గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు వల్లపు తిరుమల్ ప్రసాద్‌ను బీజేపీ జనగామ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా నియమించారు. ఈ విషయాన్ని పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్ ప్రకటించారు.

వల్లపు తిరుమల్ ప్రసాద్ విద్యార్థి దశలో ఏబీవీపీ కార్యకర్తగా, అనంతరం భారతీయ జనతా పార్టీలో క్రియాశీలక నాయకుడిగా పనిచేస్తూ రఘునాథపల్లి మండల ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. పార్టీ పట్ల ఆయన చూపిన అంకితభావం, క్రమశిక్షణ, సేవలను గుర్తించి జిల్లా కార్యవర్గ సభ్యుడిగా బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఈ సందర్భంగా తిరుమల్ ప్రసాద్ మాట్లాడుతూ, పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ జిల్లా వ్యాప్తంగా పార్టీ బలోపేతంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి మరింత కృషి చేస్తానని తెలిపారు.

తిరుమల్ ప్రసాద్ నియామకంపై రఘునాథపల్లి మండల, జనగామ జిల్లా బీజేపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.