హైదరాబాద్, ఆంధ్రప్రభ : బీసీల కోసం పోరాటం చేస్తున్న తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బీసీలందరూ అండగా ఉండాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీల కోసం కవిత ముందుకొచ్చి మాట్లాడుతున్నారని, పోరాటం కూడా చేస్తున్నారని కొనియాడారు. బీసీల కోసం అన్ని సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు.
బీసీలు కూడా కవితకు మద్దతివ్వడంతో పాటు ఆమె పోరాటానికి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. బీసీలపై చిత్తశుద్ధి లేని ప్రభుత్వంబీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని కృష్ణయ్య మండిపడ్డారు. బీసీలకు 75 ఏళ్లుగా అన్యాయం జరుగుతోందని, వాస్తప పరిస్థితిని అర్ధం చేసుకొని కమిట్మెంట్తో పోరాటం చేయకపోతే చాలా ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు.
ఇప్పుడున్న రిజర్వేషన్లు కూడా తగ్గుతాయని చెప్పారు. బీసీ కాకపోయినా కవిత మన కోసం పోరాటం ప్రారంభించారని, కేవలం మన కోసం పులి మీద స్వారీకి సిద్ధమయ్యారని అన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ఆమె చేసే పోరాటాన్ని ఎవరూ తప్పుపట్టొద్దని కోరారు. అందరం ఐక్యంగా ఉద్యమం చేస్తేనే.. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు దిగి వస్తాయని చెప్పారు. జూలై 17న జరిగే జాగృతి రైల్ రోకోకు కచ్చితంగా మద్దతు ఇస్తామని ఎమ్మెల్సీ కవితకు ఆర్.కృష్ణయ్య హామీ ఇచ్చారు.