హైదరాబాద్, ఆంధ్రప్రభ : అమెరికాలో అగ్రికల్చర్ ఎమ్మెస్సీ చదివిన ప్రియాంక.. బ్రెయిన్ డెడ్ కావడంతో ప్రాణాలు కోల్పోయినట్లు తెలియడంతో నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం పందెనపల్లి గ్రామంలో ఉన్న వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. హంట్స్విల్లే లోని అలబామా విశ్వవిద్యాలయం నుండి ఇటీవల గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన ప్రియాంక తన మాస్టర్స్ డిగ్రీని కూడా పూర్తి చేసింది. ఆమె ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్లో ఉంది మరియు తన కుటుంబానికి సహాయం చేయడానికి మరియు విద్య కోసం పొందిన రుణాన్ని తిరిగి చెల్లించడానికి ఉద్యోగం కోసం వెతుకుతోంది.
ఊహించని విధంగా..
మే 5న ఆమెకు ఎముక మజ్జను ప్రభావితం చేసే అరుదైన రక్త క్యాన్సర్ అయిన అక్యూట్ మైలోయిడ్ లుకేమియా ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆమెను హంట్స్విల్లే అత్యవసర గదికి తరలించారు. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో, ఆమెను అలబామాలోని యూఏబీ ఆసుపత్రికి తరలించారు. దురదృష్టవశాత్తు, ఆమె మెదడులో తీవ్రమైన అంతర్గత రక్తస్రావం జరిగి స్పృహ కోల్పోయింది. చికిత్స కొనసాగించిన తర్వాత, మే 7న బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో ఆమె బౌతికకాయాన్ని స్వస్థలానికి తరలించేందుకు అక్కడి వారు విరాళాలను సేకరిస్తున్నారు..
బహమాస్ లో విద్యార్ధి మృతి
అమెరికాలో చదువుకుంటున్న భారత సంతతి విద్యార్థి ఒకరు ప్రమాదవశాత్తూ బహమాస్ లో చనిపోయాడు. గౌరవ్ జైసింగ్ అనే ఆ విద్యార్థి తన స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్ళగా ఈ విషాదం చోటుచేసుకుంది. హోటల్ బాల్కనీలో పచార్లు చేస్తుండగా ప్రమాదవశాత్తూ కిందపడిపోయాడు. తీవ్రగాయాలపాలైన జైసింగ్ ను అతడి స్నేహితులు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే జైసింగ్ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
మసాచు సెట్స్లోని బెంట్లీ యూనివర్సిటీలో జైసింగ్ చదువుతున్నాడు. ఈ వారంలోనే గ్రాడ్యుయేషన్ పూర్తికావాల్సి ఉంది. ఈ సందర్భంగా స్నేహితులతో కలిసి బహమాస్ టూర్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. బహమాస్లో వారు బస చేసిన హోటల్ బాల్కనీలో పచార్లు చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ విషాదకర సంఘటనపై బెంట్లీ యూనివర్సిటీ స్పందిస్తూ.. జైసింగ్ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. జైసింగ్ కుటుంబసభ్యులకు ఎక్స్ (ట్విట్టర్) ద్వారా ప్రగాఢ సానుభూతి తెలియజేసింది.